మొన్నటిదాకా చంద్రబాబు విజన్ 2020 అని కలవరించాడు ఇప్పుడు విజన్ 2022 అని కలవరిస్తున్నాడు... విజన్ 2020 పాలసీ ప్రకారం పాతికేళ్ల మాస్టర్ ప్లాన్ విజయవంతంగా అమలు చేశాడు. అన్ని వ్యవస్టల్లోనూ తన మనుషుల్ని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఆయా వ్యవస్థల్లో కీలక స్థానాల్లో ఉన్నారు. అందుకే రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో లేకపోయినా రాష్ట్ర రాజకీయాలను ఆయనే శాసిస్తున్నాడు. ఎవరూ ఊహించనంత బంపర్ మెజార్టీతో జగన్ గెలిచి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నా ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు. ఆయన చేయాలనుకున్నవి ఏవీ చేయనీయకుండా న్యాయ వ్యవస్థ ఆయన ముందరి కాళ్ళకు బంధాలేస్తోంది. ఆయనకు ముకుతాడు వేస్తోంది. జగన్ రాజధాని మార్చాలనుకున్నా మార్చలేకపోతున్నాడు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి డాక్యుమెంట్లు కూడా సిద్ధం చేసినా ఇవ్వలేకపొతున్నాడు. హై కోర్టు దయా దాక్షిణ్యాలపై ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇది ఎంతవరకు సమంజసం అనేది అది ఒక పెద్ద డిబేట్ అనుకోండి.
సరే...ఇప్పుడు చంద్రబాబు 2022 లో ఎన్నికలు అంటున్నాడు. చంద్రబాబు అన్నాడంటే దానిని ఊరికెనే తీసిపారేయకూడదు. ఎందుకంటే కేంద్రంలో కూడా ఆయన మనుషులున్నారు. ఆయనకు అక్కడనుంచి ఏదో కచ్చితమైన సమాచారమే వచ్చి ఉండాలి. దాని ప్రకారమే 2022 లోనే ఎన్నికలు వస్తాయని చెప్పి ఉండవచ్చు. అధికారం అనేది అన్నిటికంటే పెద్ద వ్యసనం. రాజకీయనాయకుడు తన పెళ్ళాం ఎవరితోనయినా లేచిపోయినా పెద్దగా బాధపడడు కానీ... పదవి పోతే మాత్రం తట్టుకోలేడు. అని పెద్ద మనుషులు సినిమా లో నాగ భూషణం ఫేమస్ డైలాగ్. అలాగే ఉంది ఇప్పుడు మన చంద్రబాబు పరిస్థితి. వ్యవస్థలతో జగన్ ను కట్టి పడేసినా ఇంకా తృప్తిగా లేదు... అర్జెంట్ గా మళ్ళీ ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలని ఉబలాటపడుతున్నాడు. 2024 దాకా ఆగే ఓపిక లేదు...ఈయనకు మోడీ జమిలి వ్యూహం కలిసొస్తోంది. మోడీ ఎప్పటి నుంచో దేశమంతటా ఒకే సారి ఎన్నికల నినాదం ఇస్తున్న సంగతి తెలిసిందే... అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో 2024 లో జరగాల్సిన సాధారణ ఎన్నికలు ఈ సారి ఒక సంవత్సరం ముందుగానే అంటే 2023 లోనే వస్తాయని అనుకుంటున్న విషయం కూడా తెలిసిందే. అయితే చంద్రబాబు దానిని ఇంకో సంవత్సరం ముందుకు తెచ్చాడు. 2022 లోనే ఎన్నికలు అంటున్నాడు. ఏమో... నిజమేనేమో.. ఆయనకు నమ్మకమైన సమాచారం వచ్చిందేమో...
అయితే 2022 లో ఎన్నికలు వస్తే చంద్రబాబుకు లాభమా..నష్టమా అనేదే ఇప్పుడు చర్చనీయాంశం. లోతుగా ఆలోచిస్తే ముందస్తు ఎన్నికలు చంద్రబాబుకే నష్టం. ఆయనకు ఉన్న అస్త్రం రాజధాని మార్పు అంశం ఒక్కటే... కానీ అదే ఆయనకు ప్రతికూలం కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమ లో ఆయన పార్టీ వాళ్ళే ఆయనకు వ్యతిరేకం కావచ్చు. ఒకవేళ వ్యతిరేకంగా బయటపడి చేయకపోయినా స్తబ్దతగా ఉండిపోవచ్చు. పైగా ప్రజలు ఈ ఏడాదిన్నర కాలంలో జగన్ వివిధ పథకాల ద్వారా నేరుగా తమ ఖాతాల్లోకి వేసిన వందల కోట్ల సొమ్మును అనుభవించారు. మరో ఏడాదిన్నర కాలంలో ఇంకెంతో చేస్తాడు కూడా... అదంతా జగన్ కు లాభం చేకూర్చేదే కానీ... నష్టం ఏ మాత్రం కాదు. ఇకపోతే కోర్టులు రాజధాని అంశం, ఇళ్ల పట్టాల అంశం అప్పటివరకు తేల్చకపోతే చంద్రబాబే అడ్డు పడ్డాడు అని జగన్ ప్రచారం చేసుకునే అవకాశం స్వయంగా చంద్రబాబే కల్పించిన వాడవుతాడు. ఒక వేళ కోర్టులు జగన్ కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా కూడా అది జగన్ కు ప్లస్ అవుతుంది. అనుకూలంగా తీర్పు ఇస్తే ఇక చెప్పేదేముంది. సో... ఏ రకంగా చూసినా ముందస్తు ఎన్నికలు చంద్రబాబుకు నష్టమే కానీ... ఏ మాత్రం లాభం చేకూర్చవు అని చెప్పవచ్చు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి