కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేసిన విషయాన్ని సీఎం వైఎస్ జగన్ అధికారులకు వివరించారు. అలాగే ఏప్రిల్ 20 నుంచి ఇచ్చిన సడలింపులు, వాటి అమలుపై ఆయనతో చర్చించినట్టుగా తెలిపారు. లాక్డౌన్ పరిణామాలు, దీని తర్వాత అనుసరించాల్సిన వ్యుహాలపై చర్చించినట్టు చెప్పారు. రాష్ట్రంలో తీసకుంటున్న చర్యలను అమిత్షాకు వివరించడంతోపాటు.. రాష్ట్రంలో విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు సీఎం జగన్ అధికారుల వద్ద ప్రస్తావించారు. ప్రతి మిలియన్ జనాభాకు 1274 చొప్పున అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్నారు.
గుజరాత్లో చిక్కుకుపోయిన తెలుగు మత్య్సకారులను తిరిగి రాష్ట్రానికి రప్పించడంపై తాను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి, కరోనా నివారణ చర్యల కోసం రాష్ట్రానికి కేంద్రం తరఫున నోడల్ మినిస్టర్గా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామన్తో మాట్లాడినట్టు సీఎం వైఎస్ జగన్ అధికారులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ అధికారి సతీష్ చంద్ర చూసుకుంటారని కేంద్ర మంత్రికి తెలియజేశానని.. ఆ మేరకు మంత్రి కార్యాలయం నుంచి ఒక అధికారిని ఇందుకోసం కేటాయించారని సీఎం జగన్ చెప్పారు. ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చి.. తెలుగు మత్స్యకారులను ఏపీకి తీసుకొచ్చేందుకు తగిన ప్రయత్నాలు చేస్తున్నామని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్కు చెప్పినట్టు సీఎం జగన్ వెల్లడించారు. సముద్రమార్గం ద్వారా మత్య్సకారులను తీసుకురావడానికి.. ప్రయాణికులు నౌకకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి సంబంధిత విభాగాల నుంచి అనుమతులు రావాల్సిన అవసరం ఉందని, దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు నివేదించిన నేపథ్యంలో తాను ఈ ప్రయత్నాలు చేసినట్టు ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అధికారులకు వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 231 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లారని ఈ సందర్భంగా అధికారులు సీఎం వైఎస్ జగన్కు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం వైఎస్ జగన్.. వారందరికీ కూడా రూ.2వేల రూపాయలు చొప్పున అందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కొంతమందికి అందించామని, మిగిలిన వారికి కూడా అందజేస్తామని అధికారులు సీఎంకు చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కేసుల వివరాలను సీఎంకు వివరించారు. విజయవాడలో కేవలం ఇద్దరు వ్యక్తుల కారణంగా కృష్ణలంకలోని ఒక వీధిలో, కార్మికనగర్లోని ఒక వీధిలో కరోనా కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. అలాగే పశ్చిమగోదావరిలో కూడా ఢిల్లీనుంచి వచ్చిన వ్యక్తి కారణంగా వ్యాపించిందని చెప్పారు
కరోనా నిర్ధారణ టెస్టులు సంతృప్తికర స్థాయిలో నిర్వహించి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని అధికారులు సీఎంకు వివరించారు. దీనివల్ల రాష్ట్రంలో వైరస్ పరిస్థితి ఏంటి? ఏరకంగా ప్రభావం చూపుతోంది? హైరిస్క్ ఉన్నవారిపై వైరస్ చూపించే ప్రభావం తదితర అంశాలను తెలుసుకునేందుకు విస్తృతంగా నిర్వహించిన పరీక్షలు చాలా ఉపయోగపడుతున్నాయని అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ అనంతరం తీసుకునే నిర్ణయాలు, ఆతర్వాత పరిణామాల్లో భాగంగా వైద్య పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలన్నదానికి ఈ అధ్యయనం, విశ్లేషణలు తోడ్పాటునందిస్తాయని తెలిపారు.
ప్రజల్లో తీవ్ర భయం, ఆందోళన కలిగించరాదు...
కరోనా వైరస్పై వివిధ ప్రసారమాధ్యమాలు ప్రజల్లో కలిగించిన తీవ్ర ఆందోళన వల్ల సామాజికంగా చోటుచేసుకున్న విపరిణామాలపై సీఎం వైఎస్ జగన్ సమావేశంలో అధికారులతో చర్చించారు. వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు స్థానంలో... ప్రజల్లో తీవ్ర భయాందోళనలు, లేనిపోని అపోహలను కలిగించడంపై అధికారులు విచారం వ్యక్తం చేశారు. కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వెళ్లినా స్థానికులు అడ్డుకోవడం, చివరకు అది ఉద్రిక్తతకు దారితీసిన ఒకటిరెండు ఘటనలను కూడా సమావేశంలో అధికారులు సీఎంకు వివరించారు. ఆత్మీయత, మానవత్వం పోయి వివక్ష, విద్వేషం, తక్కువగా చూడ్డం లాంటి భావనలు తలెత్తేలా అక్కడక్కడా చోటుచేసుకున్న పరిణామాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని మీడియా సంస్థలు విపరీత పోకడ, తీవ్ర ఆందోళన కలిగించేలా ప్రచారం చేస్తుండడం దీనికి కారణమని వైద్య నిపుణులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ప్రజల్లో తీవ్ర ఆందోళన బదులు ధైర్యం, భరోసా, స్థైర్యం, అవగాహన, జాగ్రత్తలు పాటించేలా, చైతన్యం కలిగించేలా మరిన్ని అడుగులు ముందుకేయాలని ఆదేశించారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి