ఈ తరం యువత మనస్తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోల్డ్ గా చూపించి హిట్ కొట్టిన అర్జున్ రెడ్డి సినిమా హీరో విజయ్ దేవరకొండ ఒక విషయంలో ఆదర్శంగా నిలిచాడు. అది సినిమాలకు సంబంధించినది కాదు. వ్యక్తిగతంగా... అదేమిటంటే సినిమా హీరోలకు నటించినందుకు డబ్బుతో పాటు అప్పుడప్పుడు ఉత్తమ నటనకు అవార్డులు కూడా వస్తుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డు తర్వాత అంతటి ప్రతిష్టాకరమైనది ఫిలింఫేర్ అవార్డు. చాలా మంది హీరోలు, హీరోయిన్లు... ఆ... ఈ చెక్క ముక్కలు ఏం చేసుకుంటాం అని అనేవాళ్లు వున్నారు. వాటికి బదులు డబ్బులు ఇస్తే బాగుండు అని అనుకునే వారు కూడా ఉన్నారు. అయితే వెనకటి తరం హీరోలు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తదితరులు తమకు వచ్చిన అవార్డులను, షీల్డ్ లను ఎంతో అపురూపంగా చూసుకునేవారు. వాటిని తమ తమ స్టూడియోలలో ప్రత్యేకంగా ఒక హాలులో షోకేస్ లో భద్రపరుచుని, భవిష్యత్తు తరాలకు ఒక మ్యూజియం లా మలచారు.
సరే.. ప్రస్తుత విషయానికి వస్తే అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ తనకు వచ్చిన తొలి ఫిలిం ఫేర్ అవార్డును వేలం పాట పెట్టి అమ్మేసుకున్నాడు. ఛీ... అచ్చం ఆ సినిమాలో లాగా ఇంత అరాచకమా... అని తిట్టుకుంటున్నారా... ఆగండీ.. ఆగండి .. ఆలా చేస్తే ఆదర్శం అని ఎందుకు అంటారండి. ఆయన వేలం వేసింది తన సొంత అవసరాలకో, తాగి తందనాలాడడానికో కాదు. తన అవార్డును వేలం వేయడం ద్వారా వచ్చిన రూ.25 లక్షల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చాడు. హాట్సాఫ్ టు విజయ్ దేవరకొండ... అసలు ఆ చెక్క ముక్కలను ఇలా కూడా ఒక సత్కార్యానికి ఉపయోగించవచ్చనే ఆలోచన వచ్చినందుకు హాట్సాఫ్.. విజయ్ తన కుటుంబసభ్యులతో కలసి రూ.25 లక్షల చెక్కును మంత్రి కె.టి.ఆర్ కు గత శుక్రవారం అందచేశారు. ఈ సందర్భమ్గా కె.టి.ఆర్ హీరో విజయ్ ను అభినందించి హరితహారం కార్యక్రమంలో పాల్గొనమని కోరారు. జలం..జీవం కార్యక్రమంలో భాగంగా ఇంకుడుగుంతలు నిర్మాణం లోనూ పాల్గొని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. త్వరలోనే జలమండలి అధికారులతో కార్యక్రమంలో పాల్గొంటానని విజయ్ హామీ ఇచ్చారు. వన్స్ అగైన్ సెహబాష్ విజయ్ దేవరకొండ...
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి