సొంతూళ్లకు వెళ్లాలనుకునే వలస కూలీలకు జగన్ సర్కార్ శుభవార్త . కూలీలను వారి స్వగ్రామాలకు పంపేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది . దీనికి సంబంధించి ఉన్నత స్థాయి సమావేశంలో మార్గదర్శకాలను ఖరారు చేశారు . అయితే కొన్ని నిబంధనలు వర్తిస్తాయి .
గ్రీన్ జోన్ నుంచి మరో గ్రీన్ జోన్ కి వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు . ఈ మేరకు రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు . వలస కూలీలు ఎక్కడ ఎంత మంది ఉన్నారో లెక్కించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు . ముందుగా కూలీలకు ర్యాపిడ్ విధానంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తారు . నెగిటివ్ గా నిర్ధారణ అయిన వారిని మాత్రమే అనుమతిస్తారు . ఒకవేళ కూలీల బృందంలో ఒకరికి పాజిటివ్ వచ్చినా వారంతా ప్రస్తుతం ఉన్న చోటే ఉండాల్సి ఉంటుంది . కరోనా నిబంధనల మేరకు వారికి వైద్య సాయం అందిస్తారు . నెగిటివ్ వచ్చిన వారి సొంత ఊర్లకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పిస్తారు . భౌతిక దూరం పాటిస్తూ బస్సులో ఉండే సీట్లలో యాభై శాతం మాత్రమే నిండేలా జాగ్రత్తలు తీసుకుంటారు . వీరు సొంత ఊరికి వెళ్లిన తర్వాత అక్కడి క్వారంటైన్ కేంద్రాల్లో 14 రోజులు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన పెడుతున్నారు .
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి