శనివారం దేశవ్యాప్తంగా లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం సడలించే అవకాశం ఉండంటంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. దేశీయంగా విమానప్రయాణాలకు సంబంధించి ఎయిర్పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జీఎంఆర్ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఒక టెర్మినల్ ద్వారా మాత్రమే సేవలందించడం, ప్రయాణికులందరూ క్యూలో కచ్చితంగా 1.5 మీటర్ల భౌతికదూరం పాటించేలా మార్క్ చేయడం, అంతర్జాతీయ, దేశీయ ప్రయాణికుల లాంజ్లో సీట్ల మఽధ్య మీటర్ నుంచి 1.5 మీటర్ల వరకు దూరం ఉండటం వంటి పలు నిబంధనల్ని అమలుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఎయిర్పోర్టు లాంజ్లోని సీట్ల వరుసలో ఒక సీటు ఖాళీని వదలనున్నారు. ఇలా ఖాళీగా ఉంచే సీటులో ఎవరూ కూర్చోకుండా ‘డోంట్ సిట్ హియర్’ అని ముద్రిస్తున్నారు.
ఇక విమానాశ్రయ సిబ్బంది నుంచి కస్టమ్స్, ఇమిగ్రేషన్, భద్రతావిభాగాలు తదితర శాఖల సిబ్బంది వరకూ కూడా శానిటైజేషన్, భౌతికదూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఏడు స్థాయిల్లో సుమారు 1,27,000 చదరపు మీటర్ల స్థలంలో నిరంతరం శానిటైజేషన్ కార్యక్రమాలు జరగనున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు అమలయ్యేలా చూడటం కోసం 100మంది ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు జీఎంఆర్ సంస్థ తెలిపింది. కరోనా అనుమానితులు తిరిగిన ప్రాంతాల్లో వెంటనే క్రిమిసంహారక మందులను చల్లేందుకు, తాత్కాలిక నిర్బంధ కేంద్రాల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి