అంతర్వేది అంతం...కాదు...ఆరంభం మాత్రమే... ఏమిటి అంతం...ఏమిటి ఆరంభం అనుకుంటున్నారా... వచ్చే నాలుగేళ్లలో బి.జె.పీ ఆడే రాజకీయ చదరంగంలో ఇది తొలి అంకం మాత్రమే... నాలుగేళ్ల తర్వాత ఏపీ లో జరగబోయె అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి జరుగుతున్న మహా యజ్ఞంలో ఇది తొలి అడుగు మాత్రమే... ఏమిటీ పిచ్చి వాగుడు అనుకుంటున్నారా... ఏడాది కిందట 151 సీట్లతో గెలిచిన జగన్ కు తిరుగులేదని అనుకుంటున్నారా... ఈ ఏడాది కాలంలో ప్రజలకు నేరుగా పంచిన 50 వేల కోట్ల రూపాయలతో మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని కలలు కంటున్నారా... మీరు అలాగే కలలు కంటూనే ఉండండి... మిమ్మల్ని ఆ మత్తులో అలాగే ఉంచి చాప కింద నీరు లాగా ఏపీ లో బి.జె.పీ విస్తరించబోతోంది.
సూదంత రంధ్రం ఉంటె చాలు ఏనుగంత బెజ్జం చేయగల ఘటికులు బి.జె.పీలో చాలామంది ఉన్నారు. అసలు రంధ్రం లేకపోయినా వారే చేస్తారు... దాని ఆసరాగా అందులోనుంచి ఏనుగులను దూరుస్తారు... ఈ విద్యలో వారు ఆరితేరిన వారు. ఇప్పుడు అంతర్వేది ఘటనకు కారకులు ఎవరు అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఈ లోగా హిందూ దేవాలయాల మీద దాడి అంటూ ఆ రంధ్రంలో ఏనుగులను పంపే పనిలో ఉన్నారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇలాంటి రంధ్రాలెన్నో చేస్తారు...రగడ రగడ చేస్తారు... ఆ రగడ రావణ కాష్టంలా... నిత్యాగ్ని హోత్రంలా వచ్చే ఎన్నికల దాకా రగులుతూనే ఉండడానికి ఆర్ణాబ్ గోస్వామి అతి త్వరలో తెలుగులో సైతం రిపబ్లిక్ టి.వి మీడియా పెట్టబోతున్నాడు...
తెలుగు నాట రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంత ప్రధానమైనదో మనకు తెలుసు కదా... ప్రజల మైండ్ ఎలా కావాలంటే ఆలా ట్యూన్ చేయడానికి మీడియానే ప్రధాన అస్త్రం. సో...బి.జె.పీ తన సొంత మీడియాతో త్వరలో రంగంలోకి దిగబోతోంది. ఇండియన్ టెలివిజన్.కాం కు ఇచ్చిన ఇంటర్వూలో ఆర్ణాబ్ గోస్వామి ఈ విషయం స్పష్టం చేసాడు కూడా... వచ్చే మార్చి నాటికల్లా దేశంలో ఆరు భాషల్లో అడుగు పెట్టబోతున్నామని చెప్పాడు. అందులో తప్పకుండా తెలుగు ఉంటుంది. ఎందుకంటే తెలుగు అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలకు చెందిన భాష... తెలుగులో మీడియా అంటే రెండు రాష్ట్రాలలో రాజకీయాలను ప్రభావితం చేయవచ్చు. అసలు కరోనా కారణంగా కొంత జాప్యం జరిగింది కానీ... లేకపోతో ఈ పాటికే ఒక కొలిక్కి వచ్చేది. తెలుగులో రిపబ్లిక్ ఛానెల్ వస్తే ఇక రాష్ట్రంలో రోజూ ఏదో ఒక రగడ తప్పదు... తెలుగులో నోరేసుకుని పడే సీనియర్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ ఎవరో ఒకరికి మంచి చాన్సు వస్తుంది. ఆయన ఇక్కడ లోకల్ ఆర్ణాబ్ గోస్వామి అవుతాడు. ఇక వి.హెచ్.పీ, భజరంగ్ దళ్ వాళ్ళు ఎక్కడో చోట ఏదో ఒకటి కెలుకుతారు... దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ ఛానెల్ లో రగడ రగడ చేస్తారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలు కావాలని... కుట్ర ప్రకారం దెబ్బ తీస్తోందని గోల పెడతారు. అదే నిజమని జనాన్ని నమ్మిస్తారు.
హిందువుల్లో ఎలాగో బ్రాహ్మణ, వైశ్య కులాల్లో బి.జె.పీ కి మంచి పట్టు ఉంది. కమ్మ కులంలో ఉన్న జగన్ వ్యతిరేకత, చంద్రబాబు నిస్సహాయత ను తమకు అనుకూలంగా మరల్చుకుంటారు. కాపు కులం పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఎలాగో ఎక్కువ శాతం బి.జె.పీ కు అనుకూలంగానే ఉంది కదా... ఇక బి.సి కులాల్లో హిందూత్వాన్ని రెచ్చగొడతారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు చుక్కలు చూపెడతారు. బివేర్ ఆఫ్ బి.జె.పీ... జగన్ కళ్ళు మూసుకుంటే బి.జె.పీ ఏపీ లో సి.ఎం కుర్చీ తన్నుకుపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు...
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి