మనం ఎక్కడి నుంచి వచ్చామో... ఆ మూలాల్ని మర్చిపోకూడదు. అన్నదాతను పట్టించుకోని ఏ ప్రభుత్వమూ ఎక్కువ కాలం మనజాలదు. కార్పొరేట్ల అడుగులకు మడుగులొత్తుతూ 120 కోట్ల జనాభా కి అన్నం పెట్టె రైతును పట్టించుకోకపోతే ఆ ప్రభుత్వ పతనం తప్పదు. మట్టి మనిషని తక్కువ చేసి చూడడం తగదు... ఎంత కూడబెట్టిన కూడు పెట్టే రైతును పట్టించుకోకపోతే... చివరకు మనం కూడా ఆ మట్టిలోనే కలిసేది... అన్న నగ్నసత్యం మరువొద్దు. దేశంలో 73 శాతం డబ్బు ఒక్క శాతం కుబేరుల వద్దే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంత అసమానత కళ్ళ ముందు కనపడుతుంటే మేం అది సాధించాం... ఇది సాధించాం అని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం.
రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలే...
ఆరుగాలం కష్టపడినా.. కనీసం కూలి కిరాయి కూడా రాకపోగా... ఏ ఏటికాయేడు ఎదురు అప్పుల కుప్పలు పేరుకుపోతుంటే... ఆదుకుంటామన్న ప్రభుత్వాలు పట్టించుకోకుండా జీవితాలతో ఆడుకుంటుంటే... గత్యంతరం లేని పరిస్థితిలో ఆత్మాభిమానం ఉన్న రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. సిగ్గు, లజ్జ లేని ప్రభుత్వాలు ఎక్సగ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయే తప్ప సమస్య మూలాలను గుర్తించి శాశ్వత పరిష్కారానికి పూనుకోవడం లేదు. ఆ పని చేయలేక కాదు... చిత్తశుద్ధి లేక... అందుకే ఛస్తే గాని పట్టించుకోరని రైతులు నిర్ణయానికి వచ్చేశారు. తాను పోయినా కుటుంబం అన్నా సుఖపడుతుందని భావిస్తున్నారు. అందుకే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇలా జరగడానికి కారణం ప్రభుత్వాలే.. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలే... ఎన్నికల ముందు వస్తున్న ఈ బడ్జెట్ లో అయినా కనీసం రైతులకి మేలు చేసే పధకాలు పెడతారని అన్నదాతలు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి