ఇది చర్చలు, అధ్యయనాలు చేసే సమయం కాదు. ఇది యుద్ధ తరుణం. తాడో...పేడో... తేల్చుకోవాల్సిన సమయం. రణం చేస్తే గాని అంపశయ్యపై ఉన్న ఏ.పి ప్రాణం కొడిగట్టుకుపోకుండా మళ్ళీ ఊపిరి పోసుకోగలదు. యుద్ధం చేస్తేనే ఏపీ కి మనుగడ ఉంటుంది. రాజకీయ తెరపై అన్ని పార్టీలు కేంద్రం పై కనీసం పోరాడుతున్నట్లు నటిస్తున్న సమయం ఇది. ఇలాంటి సమయంలో ఊరు అందరిది ఒక దారి ఉలిపికట్టది ఒక దారి అన్న చందంగా మారింది జనసేనాని పవన్ పరిస్థితి . లెక్కలు తేల్చాలి అని కొంత సమయం , యుద్దానికి సైన్యం సమకూర్చుకుంటానికి మరి కొంత సమయం. అధ్యయనం అంటూ జాప్యం .విభజన హామీలకు సంబంధించి కేంద్రం ఎన్ని నిధులు కేటాయించింది, వాటిని ఏపీ సర్కారు ఏ రకంగా వినియోగించింది అనే లెక్కలు తేల్చేందుకు జనసేన నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీని పవన్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి తలా తోక లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శల్ని పట్టించుకోకుండా, అనుకున్నదే తడవుగా కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలను విభజన హామీలకు సంబంధించిన లెక్కలు అడిగి, దానికి సంబంధించి ఓ డెడ్ లైన్ కూడా పవన్ విధించారు. తాను విధించిన డెడ్ లేన్ తో బ్రహ్మాండం బద్దలవుతుందన్న రీతిలో పవన్ బిల్డప్ ఇచ్చారు కానీ ఉభయ ప్రభుత్వాలూ ఈయనగారి మాటలను చాలా లైట్ తీసుకున్నాయి. ఇంతకీ ఈ నిజనిర్ధారణ కమిటీతో పవన్ ఏం సాధించారంటే… కొండను తవ్వి ఎలుకను పట్టారని కొందరు, కనీసం ఎలుక కూడా దొరకలేదని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తొలి సమావేశం రెండు రోజుల పాటు జరిగింది . కేంద్రం నిధులు, విభజన హామీలపై జేఎఫ్సీలోని నేతలు, మేధావులు, న్యాయనిపుణులతో చర్చించారు. లోక్సత్తా వ్యవస్థాపకుడు జేపీ, ఉండవల్లి అరుణ్కుమార్, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఇంతకీ జే.ఎఫ్.సి సమావేశంలో ఏం చర్చిస్తారంటే కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలను నిలదీయాలని ఓ తీర్మానాన్ని ఆమోదించి చేతులు దులుపుకోవడం తప్ప మరేమీ జరగబోదు. విభజన హామీల అమలుపై గళం విప్పుతానని చెబ్తున్న పవన్ కళ్యాణ్ కూడా గోడమీద పిల్లి చందంగా వ్యవహరిస్తున్నారు. ముందే చెప్పుకున్నట్లు యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధమే చేయాలి. కానీ... ఈ సినిమా హీరో వైఖరి చూస్తుంటే రాజకేయాల్లో అన్నను మించిన కామెడీ హీరోగా.. చివరకు జీరోగా మారేట్టు కనపడుతున్నాడు.
మానవేంద్ర
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి