తెలంగాణలో ఎన్నికల శంఖారావం మోగింది. ఇక ఏ.పీ లో మోగించడానికి రంగం సిద్ధం అవుతోంది. తెలంగాణ క్యాబినెట్ గత వారం సమావేశమై క్యాబినెట్ రద్దుకు తీర్మానం చేసి, ఎన్నికలకు కేంద్రానికి సిఫార్స్ చేస్తే... కేంద్రం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మరి కొన్ని రాష్ట్రాలకు కూడా ముందస్తు ఎన్నికలు జరపడానికి సిద్ధపడే అవకాశం ఉంది. అయితే ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకోకపోయినప్పటికీ ఆరునెలల ముందు ఎన్నికల కమిషన్ ఆయా ప్రభుత్వాలను రద్దు చేసి ఎన్నికలు జరిపించే అవకాశం ఉంది. కాబట్టి డిసెంబర్ ఆఖరు లేదా జనవరిలో ఏ పీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీ పైకి ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తున్నప్పటికీ తన పటిష్టమైన పార్టీ యంత్రాగం, అధికార యంత్రాగం ద్వారా అన్నిటికి సిద్ధం గానే ఉంది. కాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్ పాదయాత్ర పేరుతొ ఇంకా ఊళ్ళు పట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు. మరో ప్రతిపక్ష జనసేనాని పవన్ కళ్యాణ్ అమావాస్యకు, పౌర్ణమికి ఆలా... కనపడి... ఇలా మాయమవుతాడు తప్ప, రెగ్యులర్ గా జనం మధ్య ఉండే మనిషి కాదు. పైగా ఆయన పార్టీ కూడా వ్యవస్థీకృతంగా ఇంకా పూర్తిస్థాయిలో నిర్మాణం కాలేదు. ఈ పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ నిర్మాణ పరంగా అన్నిటికి సిద్ధంగా ఉండగా... ప్రతిపక్షాలు ఇంకా సంసిద్ధం కాలేదు. అయితే అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం కూడా వివిధ కులాలు, వర్గాలు, మతాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడంలో బిజీగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే గుంటూరు లో నారా హమారా...టి.డి.పీ హమారా పేరుతొ ముస్లిం ఆత్మీయ సదస్సు నిర్వహించింది. త్వరలో బి.సి.లతో కూడా ఇదే తరహాలో మరో సదస్సు నిర్వహించనుంది.అక్టోబర్ 2 న నిరుద్యోగ భృతి ప్రకటించనుంది. రుణమాఫీ ఆఖరి విడతను కూడా ప్రకటించే అవకాశం ఉంది. కాంట్రాక్టు, అవుట్ సోర్స్ ఉద్యోగులకు ఎంతో కొంత పెంచి, వారిని సంతృప్తి పరచి ఓట్లు అడిగేందుకు ఆయా సంఘాల నుంచి నివేదికలు తెప్పించుకుంటోది.
ఇక వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ పక్క జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో బి.సి. అధ్యయన కమిటీ వేసి బి.సి. ల లోని వివిధ కులాలతో విడివిడిగా సమావేశమై వారి వారి సమస్యలు, డిమాండ్లు తెలుసుకుంటూ సమగ్రంగా, శాస్త్రీయంగా ఒక నివేదిక తయారుచేసి, తమ అధినేత జగన్ కు అందజేసే పనిలో ఉంది. ఆ నివేదికను ఆధారం చేసుకుని ఆయన బి.సి. డిక్లరేషన్ ప్రకటించనున్నారు. మరో పక్క విశాఖలో ఈ రోజు బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు నిర్వహిస్తోంది. 12 న విశాఖలోనే వై.ఎస్.ఆర్.సి.పీ ముస్లిం ఆత్మీయ సదస్సు నిర్వహిస్తోంది. ఈ మధ్యలో 11న జగన్ నియోజకవర్గ సమన్వయ కర్తలతో సమాయత్తమవుతున్నారు. అంటే... పాదయాత్రలో ఉంటూనే జగన్ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారని అర్ధమవుతోంది. పైగా 9 వ తేదీ ఆదివారం విశాఖ నగరంలో జగన్ అరంగేట్రం అదుర్స్ అనిపించేలా ఉండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో సమధికోత్సాహాన్ని నింపింది. ఎటొచ్చి జనసేన పరిస్థితే అయోమయంలో ఉంది. 2009 ఎన్నికల ముందు పార్టీ పెట్టిన నాటికి, ఇప్పటికి పరిస్థితిలో అయితే పెద్ద మార్పేమీ లేదు. ఇక బీ.జె.పీ ప్రభావం ఏ.పీ లో నామమాత్రమే... అక్కడక్కడా ఆయా నాయకుల వ్యక్తిగత ఇమేజీని బట్టి కొంత మేరకు ఓట్లు సాధించవచ్చు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి