లాక్డౌన్ ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నా కొందరికి ఇది ఇబ్బందిగా మారింది. మద్యానికి అలవాటు పడిన వారు మద్యం సరఫరా నిలిచిపోవటంతో పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ఎవరైనా నిత్యావసరాలు లేక, తినటానికి అన్నం లేక ఇబ్బందులు పడే వారిని చూసి ఉండవచ్చు. కాని తాగటానికి మద్యం లేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు. కల్లు దొరకలేదని కొంతమంది, మద్యం దొరకటం లేదని మరికొందరు ఆత్మహత్యలు చేసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దొరకక 55 సంవత్సరాల మధు ఆత్మహత్య చేసుకొన్నాడు. బంజారాహిల్స్ ఇందిరానగర్లో ఉంటున్న మధు సినీ పరిశ్రమలో పెయింటర్గా పని చేస్తున్నాడు. ప్రతి రోజూ మద్యం తాగే అలవాటు ఉన్న ఇతనికి మద్యం దొరక్క ఇబ్బంది పడ్డాడు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్లోని ఎనిమిదో బ్లాక్ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.బేగంపేట బ్రాహ్మణవాడికి చెందిన సాయికుమార్ మద్యం దొరక కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇతను పంజాగుట్ట సర్కిల్లోని రెండు ఫ్లైఓవర్స్ మధ్య నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు
వీరి కథ ఇలా ఉంటే నిజామాబాద్లో నివాసం ఉండే ముగ్గురు తాగటానికి కల్లు దొరకకపోవటంతో ఆత్మహత్య చేసుకున్నారు. ముందు వీరు వింతగా ప్రవర్తించారని అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. నిజామాబాద్లోని గాయత్రీనగర్ కు చెందిన శంకర్ తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సాయినగర్ కు చెందిన శకుంతల వింత ప్రవర్తనతో ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ముదిరాజ్ వీధికి చెందిన మరో వ్యక్తి కల్లు దొరక్కపోవడంతో రెండ్రోజుల కిందట మూర్ఛ వచ్చిందని, తీరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
నిత్యం మద్యం తాగేవారికి మానసిక సమస్యలు తలెత్తె అవకాశం ఉందని మానసిక వైద్యులు చెబుతున్నారు. మద్యం తాగిన వారు ఆకస్మికంగా మానేస్తే.. వారిలో తాగాలనే కోరిక తీవ్రంగా పెరిగిపోతుంది. ఎంతసేపూ వారి మనసును ఆ ఆలోచనే తొలిచివేస్తుంది. ఆల్కాహాల్ లభించకపోతే మెంటల్గా, రెస్ట్లె్సగా తయారవుతారు. మానసిక ప్రశాంతత కోల్పోయి, ఇరిటేటివ్గా ఉంటారు. ప్రతి చిన్న విషయానికి విసుక్కోవడం, కోపగించుకోవడం, చీటికి మాటికీ చిర్రుబుర్రులాడడం చేస్తారు. వీటితో పాటు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా శరీరంలో వణుకు, కడుపులో వికారం, వాంతి వచ్చినట్లు ఉండడం, ఆకలి లేకపోవడం, జీర్ణపరమైన అనారోగ్యాలు, గుండె దడ, విపరీతమైన ఆందోళనకు గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాటిని నివారించేందుకు మానసిక వైద్యుని పర్యవేక్షణలో చికిత్స అవసరం.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి