ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వై.ఎస్.ఆర్ సి.పీ అభ్యర్థిగా బీ.జె.పీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురామయ్య పోటీకి రంగం సిద్ధం అయింది. పర్చూరు నియోజకవర్గంపై దగ్గుబాటి కుటుంబానికి ఇప్పటికి గట్టి పట్టు ఉంది. దగ్గుబాటి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండడంతో ఇన్నాళ్లు పర్చూరు రాజకీయ తెరపై కొత్త కొత్త ముఖాలు వచ్చినప్పటికీ, దగ్గుబాటి కుటుంబం తెరపైకి వస్తే ఇంకా వేరేవారికి అక్కడ ఛాన్స్ ఉండదు.
1982 మార్చ్ 29న ఎన్.టీ ఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు ఆయన కుటుంబం నుంచి ఆయనకు సపోర్ట్ గా నిలబడిన మొట్టమొదటి వ్యక్తి ఎన్.టీ ఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు. అంతేకాదు...మొట్టమొదటి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు కూడా.... రాష్ట్రం మొత్తం తెలుగు యువత పైన ఆయనకు మంచి పట్టు ఉండేది. 1983 జనవరిలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి ఎన్.టీ ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అంతకు ముందు ఎన్నికల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ గా, మంత్రిగా ఉన్న ఎన్.టీ ఆర్ చిన్న అల్లుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే మామపై అయినా పోటీ చేస్తా అని డంబాలు పలికాడు. ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయాక చంద్రబాబు మెల్లగా... మామ చాటున చేరాడు. 1984 ఆగష్టు లో నాదెండ్ల భాస్కర రావు వెన్నుపోటు నుంచి బయటపడవేయడంలో సహాయ పడ్డాడన్న కృతజ్ఞతతోను... చంద్రబాబు ఒత్తిడి తట్టుకోలేక ఆయన కోసం ఎన్.టీ ఆర్ కర్షక పరిషత్ అనే ఒక కొత్త పోస్ట్ సృష్టించి దానికి చైర్మన్ గా నియమించాడు. అప్పటిదాకా ఎన్.టీ ఆర్ కుటుంబంలో పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఒక్కరే తెలుగుదేశం పార్టీ తరపున క్రియాశీలకంగా ఉన్నారు. చిన్న అల్లుడు చంద్రబాబు రాకతో ఆధిపత్య పోరు మొదలైనది. చంద్రబాబు రాకతో మరో కొత్త అధికార కేంద్రం ఏర్పడింది. దగ్గుబాటిది ముక్కుసూటి మనస్తత్వం, కల్లా కపటం తెలియని, నిజాయితీ, నిఖార్సయిన రాజకీయం. చంద్రబాబుది ఇందుకు పూర్తిగా విరుద్ధమైన మనస్తత్వం. చంద్రబాబు కుట్ర రాజకీయాలకు ఆ కుటుంబంలో మొదటిగా బలయింది దగ్గుబాటే. ఆ తర్వాత కదా అందరికీ తెలిసిందే...

పర్చూరులో దగ్గుబాటి కుటుంబం వస్తే అక్కడ ఇక తిరుగుండదు. దగ్గుబాటి హితేష్ వై.ఎస్.ఆర్.సి.పీ లో చేరితే అది ఆ పార్టీకి కమ్మ సామాజిక వర్గంలో మంచి ప్లస్ అవుతుంది. అయితే నిన్న గాక మొన్న పరకాల ప్రభాకర్ మీద జగన్ చేసిన విమర్శను ఇప్పుడు జగన్ ఎదుర్కోవలసి వస్తుంది. బి.జె.పీ నాయకురాలు పురందేశ్వరి కుమారుడికి వై.ఎస్.ఆర్.సి.పీ టిక్కెట్ ఇచ్చారని, ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయానికి ఇదే నిదర్శనం అని చంద్రబాబు, ఆయన వర్గం దుమ్మెత్తి పోస్తుంది. రాజకీయాలలో ఇవన్నీ సహజమే. ఎవరేమనుకున్నా జనం యాక్సప్ట్ చేస్తే ... అదే అంతిమ తీర్పు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి