విభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా యెడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యెడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి అను నేను... అనే మాట ఎప్పుడు వింటామా అని రాష్ట్ర ప్రజలు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రజలు తమ భావి నేతగా ఆయన్ను గత నెల 11 వ తేదీనే ఎన్నుకున్నప్పటికీ అధికారికంగా ప్రకటన ఈ నెల 23 వ తేదీన కౌంటింగ్ ఫలితాల అనంతరం వెలువడనుంది.
అధికారం లేనిదే చంద్రబాబుకు నిద్ర పట్టదు
చంద్రబాబుకు తన ఓటమి గురించి స్పష్టంగా తెలిసే... ఇక రాష్ట్ర రాజకీయాల్లో తన పాత్ర ముగిసిపోయిన అధ్యాయమని గమనించే...ఈ మధ్య తరచుగా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడకుండా... దేశ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. అధికారం లేనిదే చంద్రబాబుకు నిద్ర పట్టదు. అందుకే 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రగిరి నుంచి పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి చేతిలో ఓడిపోగానే ప్లేటు ఫిరాయించి మామ ఎన్ టీ ఆర్ పక్కన చేరిపోయాడు. పుష్కర కాలం పాటు మామ చాటున ఉండి అన్నీ తానై నడిపించిన చంద్రబాబు తనకు లక్ష్మి పార్వతి అడ్డు తగులుతోందని ఏకంగా మామనే తప్పించి సి.ఎం కుర్చీని లాగేసుకున్నాడు. 9 ఏళ్ల పాటు సి.ఎం గా వెలగబెట్టి... 2004 ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖర రెడ్డి చేతిలో పరాజయం పొందాక... ఏమి చేయలేక కుక్కిన పేను లాగా పడి ఉన్న చంద్రబాబు 2009 ఎన్నికల్లో మహా కూటమి ఏర్పాటుచేసి ఎలాగయినా వై.ఎస్.ను ఓడించాలని శతవిధాలా ప్రయత్నం చేశాడు. అయినా చంద్రబాబు పప్పులు ఉడకలేదు. మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఏ మాత్రం మనసు అంగీకరించని చంద్రబాబు రెండోసారి గెలిచిన వై.ఎస్.ను అసెంబ్లీ లోనే మళ్ళీ ఎలా వస్తావో చూస్తాను అని హెచ్చరించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే రెండోసారి గెలిచిన వంద రోజుల్లోనే వై.ఎస్. భౌతికంగా అదృశ్యమవడం.. ఆ తర్వాత ఆ ఐదేళ్లు చంద్రబాబు పేరుకు ప్రతిపక్షమైనా అధికార పక్షంతో కలసి జగన్ ను ఒంటరి వాడిని చేసి కేసులు పెట్టి, వేధించిన సంగతి అందరకూ తెలిసిందే... 2009 నుంచి ఆ రకంగా పరోక్షంగా కాంగ్రెస్ తో కలసి నడుస్తున్న చంద్రబాబు మొన్న తెలంగాణ ఎన్నికల నాటి నుంచి ప్రత్యక్షంగా కాంగ్రెస్ తో కలసి అడుగులు వేస్తున్నాడు.
కేసుల నుంచి తప్పించుకోవడానికి బాబు ఢిల్లీ రాజకీయాల్లోకి...
2019 ఎన్నికల్లో ఎన్ని గిమ్మిక్కులు చేసినా రాష్ట్రంలో జగన్ కే అధికారం దక్కనున్నదని తెలిశాక.. కనీసం కేంద్రంలో అయినా చక్రం తిప్పి తనకు అనుకూలమైన వారిని ప్రధానిని చేయడం ద్వారా భవిష్యత్తులో జగన్ తనపై కేసులు పెట్టి జైలు పాలు చేయాలని చూసినా తప్పించుకోవచ్చనే తాపత్రయంతోనే... ఇప్పుడు మాట్లాడితే ఢిల్లీ పరుగెత్తి...అందరిని వాటేసుకుంటున్నాడు. ఒక వేళ కాంగ్రెస్ కూటమి అధికారం లోకి రాని పక్షములో మళ్ళీ కమలం తో జత కట్టడానికి కూడా ఏ మాత్రం వెనుకాడడు.. ఎందుకంటే... ఆయన అవసరం అలాంటిది. చేసిన పాపాలు అన్నీ పండి... ఎక్కడ కొంప ముంచుతాయోనని భయం...
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి