అన్నం ఉడికిందా లేదా అన్న విషయం కనుక్కోవటానికి ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది. ఆరునెలల పాలన కాలంలో మంచి సీఎంగా అని పించుకుంటానని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి ప్రమాణస్వీకార సభలో చెప్పుకున్నారు. ఆరునెలలు అవసరం లేదు. ఆరు రోజుల్లో దటిజ్ జగన్ అని పించుకొని ప్రజల మన్ననలు పొందుతున్నారు. మంచి చేయాలన్న సంకల్పం, అందకు తగ్గ కార్యదీక్ష ప్రజలకు దగ్గరకు చేరుస్తాయి. ఇందుకు జగన్ ప్రత్యక్ష తార్కాణంగా నిలుస్తారు. ఒట్టి మాటలతో, బూటకపు హామీలతో కాలం గడుపుకోవాలని చూస్తే ప్రజలు అటువంటి వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేస్తారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం మన మాజీ సీఎం చంద్రబాబునాయుడే.
అతి పిన్న వయస్సులోనే గద్దె ఎక్కిన వైఎస్ జగన్మోహనరెడ్డికి ప్రజల బాధలు, వారి కన్నీళ్లు..కష్టాలు తెలుసు. వారి ఆకాంక్షలు తెలుసు. పాదయాత్ర ఇందుకు దోహదపడి ఉండవచ్చు. ఏసీ గదుల్లో కూర్చొని గంటల కొద్ది సమీక్షలు నిర్వహించినా ప్రజల బాధలు తెలియవు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైతేనే వారి కన్నీళ్లు ,కడగండ్లు ఉనికిలోకి వస్తాయి. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగిన పాదయాత్ర జగన్ను ప్రజల మనిషిగా మార్చాయి అని చెప్పటంలో అతియోశక్తి లేదు. పాదయాత్ర సమయంలో చంద్రబాబు పాలనలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను చూసిన జగన్ సీఎం ఎలా ఉండకూడదో తెలుసుకున్నారు. మంచి సీఎంగా ఎలా ఉండాలో అప్పుడే నిర్ణయం తీసుకొన్నారు. సమస్యలు వినటమే కాదు.ఆయా సమస్యలు ఎలా పరిష్కారమౌతాయో, అందుకు ఎంత వనరులు అవసరమౌతాయో లెక్కలు వేసుకొన్నారు. అందుకు జగన్ అలవికాని హామీలు ఇవ్వలేదు. రెండు పేజీల మ్యానిఫేస్టోలో తాను అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకున్నారో చెప్పారు. పాదయాత్రలో నేటి జగన్పాలనకు బీజం పడింది.
అధికారంలోకి రావటంతో అధికారం, హడావిడి ప్రజలకు దూరం చేసే అర్బాటాలను దూరం పెట్టారు. ప్రమాణస్వీకారానికి ముందే తిరుపతిలో ఇద్దరు మహిళల సమస్య వినటానికి తన కాన్వాయ్ ఆపిన జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత కూడా ఇదే పద్దతి ఫాలో అయ్యారు. విశాఖలో ఇదే తరహ మానవత్వాన్ని చాటుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి తిరిగి వెళ్లేందుకు బయలుదేరిన ముఖ్యమంత్రికి విమానాశ్రయం ఆవరణలో ‘బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి’ అని రాసి ఉన్న బ్యానర్ పట్టుకుని కొంతమంది యువతీ యువకులు నినాదాలు చేస్తూ కనిపించారు. అతి వేగంగా వెళ్తున్న కాన్వాయ్లోంచి రెప్పపాటు వ్యవధిలో ఆ దృశ్యాన్ని గమనించిన సీఎం జగన్ వెంటనే కాన్వాయ్ ఆపండని ఆదేశించారు. వాహనం లోంచి కిందికి దిగి, బారికేడ్ అవతల ఉన్న ఆ యువతీ యువకులను తన వద్దకు అనుమతించాలంటూ అధికారులకు చెప్పారు. వారు తన వద్దకు రాగానే అసలేం జరిగిందంటూ ఆప్యాయంగా పలకరించారు. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న తమ స్నేహితుడు నీరజ్కుమార్ ఆపరేషన్కు రూ.25 లక్షలు ఖర్చవుతుందని, ఈనెల 30న ఆపరేషన్ చేయించకపోతే కష్టమని వైద్యులు చెప్పారన్నారు.నీరజ్ని ఎలా బతికించుకోవాలో తెలీక మీ దృష్టిలో పడాలని ఇలా చేశామన్నారు. వారు చెప్పిందంతా ఓపిగ్గా విన్న ముఖ్యమంత్రి.. ‘నీరజ్ బతుకుతాడు.. ఎప్పటిలానే మీతో సరదాగా, సంతోషంగా ఉంటాడు.. మీరేం అధైర్య పడొద్దు’ అంటూ తన సెక్రటరీ ధనుంజయ్రెడ్డిని పిలిచి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. . పదవి అంటే పెత్తనం కాదని, ప్రజల కష్టాల్ని పంచుకునే అధికారమని నిరూపించారు జగన్. మొన్న గుంటూరు లో ఇఫ్తార్ విందుకు హాజరై తిరిగి వెళుతూ అక్కడ ఉన్న పారిశుధ్య కార్మికులను తానే స్వయంగా దగ్గరకు పిలిపించుకుని, వారి చేతులు పట్టుకుని ఆప్యాయంగా అక్కా ... జీతాలు ఎంత వస్తున్నాయి... అని అడిగాడు.. వారు ఒక్క సారిగా అమితానందంతో మాకు 12 వేలు ఇస్తున్నారు. 18 వేలు ఇస్తామని ఇవ్వలేదు.. మోసం చేశారు అని చెప్పగా.. మీకు 18 వేలు ఇస్తే సంతృప్తిగా ఉంటారా... మీకు మంచి చేస్తాను.. అని చెప్పి అక్కడ నుంచి కదిలారు.. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు జనంలోకి వెళ్లడం వేరు.. సి.ఎం. గా ఉంది కూడా... రోడ్లు ఊడ్చే మా బోటి వారిని ముట్టుకోవడానికే ఎవరూ ముందుకు రారు... అలాంటిది ఆయనే మమ్మల్ని దగ్గరకు పిలిచి చేతులు పట్టుకుని ఆత్మీయంగా అక్కా.. అంటూ మా కష్టాలు అడిగి తెలుసుకోవడం ... మేము ఎంతో మంది సి.ఎం ప్రోగ్రాం లకు ఇలాగే పనిచేశాం.. కానీ ఇంట మంచి సి.ఎం ను ఎప్పుడూ చూడలేదు... అంటూ ఆ నలుగురు మహిళా పారిశుధ్య కార్మికులు అమితానంద పడిపోయారు.
గతంలో అధికారంలోకి వచ్చిన వారు అధికారాన్ని వినియోగించుకొని అడ్డంగా ఎలా సంపాదించుకున్నారో చూశాం. కాని ఇందుకు భిన్నంగా అనుక్షణం తాను పేదలకు ఇచ్చిన హామీల అమలుకు ఏమి చేయాలో అలోచించే వినూత్న ముఖ్యమంత్రిని ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. ఫించన్ల పెంపు, ఆశావర్కర్ల వేతనాల పెంపు, మద్యపాన నిషేధానికి కసరత్తు, ఇలా.. రోజుల వ్యవధిలోనే జగన్ సాధించిన విజయాలు. ఇలా అయితే మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవటానికి ఆరునెలలు సమయం అవసరమా..?
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి