ఎప్పుడూ రాజకీయాలు, ఆయా పార్టీల కథలు, కుట్రలు, విమర్శలతో ఉదయాన్నే ఉద్వేగాలను రాజేసే వార్తల నడుమ కొన్ని వార్తలు మనస్సుల్లో మంటలు రాజేస్తుంటాయి. మానవత్వాన్ని తట్టి లేపుతుంటాయి. కాలే కడుపు ఎంతటి ఘోరానికైనా సిద్ధం చేస్తుంది. పేదరికానికి కన్న పేగు బంధం దూరం చేస్తుంది. ఇదే విషయాన్ని ఈనాడు ఈ రోజు 17వ తేదీ మెయిన్లో హైలెట్ చేసింది. పేదరికానికి ఓడిన పేగు బంధం .. అన్న శీర్షికతో వెలువడిన కథనం పేద ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను కళ్లకు కట్టినట్లు వివరించారు.
పేగులు తెగేలా పురిటి నొప్పులు పడి కన్నారు.... వారు పస్తులు ఉండి పిల్లల కడుపు నింపారు... పేదరికం వికటాట్ట హాసం చేస్తున్నా ఆకలి బాధ తెలీకుండా పెంచారు. ప్రేమకు మేము పేదలం కాదని వారు తమ బిడ్డలను గారాబంగా పెంచుకున్నారు. కాని ఎంత కాలం... ప్రతి క్షణం వారికి జీవితమే జీవన్మరణ సమస్య అయినప్పుడు తమ బిడ్డలనే అమ్ముకోవటానికి సిద్దమయ్యారు. ఒడిస్సా, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు సంఘటనలు. కాని అంశం ఒక్కటే పేదరికం. ఒడిశా మహిళ తన భర్త చనిపోగా కర్మకాండలకు డబ్బులు లేక కుమార్తెను అమ్ముకోవడానికి సిద్ధ పడింది. అక్కడికి చనిపోయిన వారి కర్మ కాండలకు ప్రభుత్వం హరిశ్చంద్ర పధకం కింద డబ్బులు ఇస్తుందని తెలిసి పంచాయతీ వారిని అడిగితే నిధులు లేవన్నారట. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డను అమ్ముకోవడానికి సిద్ధపడింది. ఇక తెలంగాణ మహిళ కట్టుకున్నోడు వదిలేసి వెళ్ళిపోతే... ఇద్దరు పిల్లలను పోషించలేక ఒక బిడ్డను 20 వేలకు అమ్ముకోవడానికి సిద్ధపడింది. ఈ రెండు సంఘటనల్లోనూ తప్పెవరిది...? ఈ తప్పు వారిదా... సమాజానిదా?
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి