ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు.. దాచేస్తే దాగని సత్యం అని ..మహాకవి శ్రీశ్రీ దశాబ్దాల కిందట చెబితే తెలుగు మీడియాలో ఒక వర్గానికి ఇప్పుడే జ్ఞానోదయం అయినట్లుంది. గత కొన్ని రోజులుగా మాత్రమే... ఒక వర్గానికి చెందిన మీడియా, పత్రికలకు ప్రజల కష్టాలు తెలిసి వచ్చినట్టున్నాయి కాబోలు... మొన్నటిదాకా తమ ప్రభువు ఎక్కిన పల్లకి మోస్తూ సగటు ప్రజలను విస్మరించిన ఈ మీడియాకు ఇప్పుడు సడన్ గా ప్రజలు గుర్తుకువచ్చారు. ప్రజాస్వామ్యం గుర్తుకువచ్చింది.
ఇంకేముందే రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని, మహిళలపై దాడులు పెరిగిపోయాయని, పెట్టుబడులు వెనక్కు పోతున్నాయని, ప్రపంచబ్యాంకు సైతం రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని చూసి నిధులు ఇవ్వమని తేల్చి చెప్పిందని ఇలా కథనాలు వండి వారుస్తున్నారు. ప్రజా సమస్యలు వెలుగులోకి తీసుకురావటం మంచిదే. ఈ విషయంలో ఎవరూ కాదనరు. శ్రీరంగ నీతులు చెప్పే ఈ పత్రికలు, మీడియా ఇంతగా ప్రజలపై ప్రేమ పుట్టుకురావటానికి కారణమేమిటి..? గత ఐదు సంవత్సరాల కాలంలో కనిపించని చీకటి కోణాలు ఇప్పుడే ఎందుకు వెలుగులోకి వస్తున్నాయి...? ఈ వర్గ మీడియా ఎజెండా ఏమిటి..? ఈ ప్రశ్నలే సగటు మనిషిలో తొలుస్తున్నాయ.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలన్నర కాలం. అంతే ఇప్పుడే పుట్టిన శిశువు కింద లెక్కే. ఈ శిశువు ఒక్కసారిగా పరిగెట్టాలని ఆశించటం ఎంతటి అవివేకమో, నెలల ప్రభుత్వంలో లోపాలు వెతకటం అంతే అవివేకం అవుతుంది. పత్రికలు, మీడియా ప్రజల ఆకాంక్షలను ప్రతిభించేలా ఉండాలి. వారి సమస్యలను ప్రభుత్వానికి ఎత్తి చూపి పరిష్కారం చూపే వారధిలా ఉండాలి. కాని ఏపీలో అత్యధిక శాతం మీడియా ఎన్నడూ ఆ ప్రయత్నం చేయలేదు. ఒక సామాజికవర్గం చేతిలో ఉన్న ఈ మీడియా ఐదేళ్ల పాటు పచ్చమీడియాగా మారి చంద్రబాబు భజనలో తరించింది. ఒకరిని మించి ఒకరు భజన చేయటంలో పోటీ పడ్డారు. బాబు తాన అంటే మీడియా తందాన అంది. ప్రపంచ ప్రసిద్ది రాజధాని అంటే మీడియా గ్రాఫీక్స్ మాయాజాలం, పోలవరం ప్రాజెక్టు ఇలా అన్ని విషయాల్లో ప్రజలకు వాస్తవాలు తెలియకుండా జాగ్రత్తపడింది. పథకాల విషయంలోనూ కోడిని వేలాడదీసి కోడి కూర తిన్నట్లు ఊహా లోకంలో విహరింపచేశారు. తిరిగి తమ ప్రభుత్వమే వస్తుందని చంద్రబాబు చెబితే గుడ్డిగా నమ్మారు. ప్రజల్లో రగులుతున్న అలజడిని అంచనా వేయలేకపోయారు. అందుకే ప్రజలు వారి బాస్కు 23 సీట్లిచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఈ సమయంలోనైనా కళ్లు తెరిచి పునఃసమీక్ష చేసుకుంటే ప్రజాభిమానం పొందే అవకాశం ఉండేది. కాని యధారాజా తధా ప్రజా అన్నట్లు చంద్రబాబులో మార్పులేదు. ఆయనకు కొమ్ము కాసే పత్రికల్లో కూడా మార్పు లేదు. వాస్తవంగా పత్రికలు, మీడియా ఎప్పుడూ ప్రతిపక్ష పాత్రే పోషించాలని ఈ రంగ ప్రముఖులు చెబుతుంటారు. బాబు భజనలో నిమగ్నమైన మీడియా ఆ బాధ్యతను విస్మరించాయి. పచ్చ కామెర్ల జబ్బు మళ్ళీ తిరగబెట్టింది... జాగ్రత్త సుమా.... కామెర్లు తిరగబడితే... చాలా డేంజర్ అని పెద్దలు చెబుతుంటారు....
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలలు టైం ఇచ్చి, తప్పులు జరిగితే ప్రశ్నిస్తామని చంద్రబాబు చెప్పారు. ఇది నిజమే అని ప్రజలు నమ్మారు. పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేసే దిశలో జగన్ నిమగ్నమయ్యారు. నవరత్నాల పథకాలను అమలు చేయటం ప్రారంభించారు. ఆరునెలల కాలంలోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవటానికి జగన్ అడుగులు వేస్తున్నారు. తిరిగి మీడియా బాస్కు పూనకం వచ్చింది. ఆరునెలల సమయం మాట మరిచిపోయారు. ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన పెద్దలు బురద జల్లటానికి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న విధంగా బాబును నమ్ముకున్న పచ్చమీడియా నగ్నంగా విలువలు వదిలి బాబును ఫాలో అవటం మొదలు పెట్టింది.ఇంకేముంది విత్తనాల కొరత, రైతుల ఆత్మహత్యలు, మంచినీటి కొరత, రోడ్ల దుస్థితి ఇలా బ్యానర్ కథనాలు వండి వార్చటం మొదలు పెట్టింది. ఇక్కడే ఒక్క ప్రశ్న. ఈ సమస్యలకు కారణమెవరు. సమస్యలనేవి ఉన్నట్టుండి సృష్టింపబడవు కదా... ఎన్నో ఏళ్లుగా ఆయా రంగాలపై ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తేనే సమస్యలు ఏర్పడతాయి. నేరం కేవలం యాభయ్ రోజుల కిందట అధికారంలోకి వచ్చిన జగన్ దా ... ఐదు సంవత్సరాల పాలన చేసిన చంద్రబాబుదా.. మీరే చెప్పండి..!
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి