ఆరునెలల కాలంలో ప్రజల చేత మంచి సీఎం అనిపించుకుంటానని ఎప్పుడైతే జగనమోహనరెడ్డీ ప్రకటించాడో అప్పటి నుంచి చంద్రబాబునాయుడు, ఆయన భజన మీడియా చేసిన, చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. వైసీపీ నాయకులు, అభిమానులు అంగీకరించినా, అంగీకరించకపోయినా జగన్ సీఎంగా పదవి చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన నెగిటీవ్ ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రజల మనస్సుల్లో బాబు అండ్ కో నింపిన విషం ముందు జగన్ సంక్షేమ పథకాలు నిర్వీర్యంగా మారుతున్నాయి. కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న చంద్రబాబును వైసీసీ టీమ్ తక్కువగా అంచనా వేసినట్లు కనబడుతుంది. మీడియాను ఎలా వాడుకోవాలి..? విపత్కర పరిస్థితుల్ని సైతం తనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలన్న అంశంలో బాబును మించిన వారు లేరు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు మొదలు నిన్నటి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య వరకు చంద్రబాబు అనుసరించిన పంథా తప్పేనా అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్లే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజలు జగన్ సంక్షేమ పథకాలను సైతం చంద్రబాబు, బాబు మీడియా కోణం నుంచే అనుమానంగా చూడటమే ఇందుకు తార్కాణం.
జాతీయ మీడియా సైతం జగన్ కు వ్యతిరేకంగా...
కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం ఆని చంద్రబాబు ఏనాడు చెప్పాడో ఆనాడే బాబు వ్యూహం ఏదో ఉందని కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు భావించారు. వాస్తవంగా జగన్ గత కొంతకాలంగా సంక్షేమ పథకాలను ఇచ్చిన హామీల మేరకు నెరవేర్చటానికి సాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ ప్రతి కదలికలోనూ తప్పులు వెదకటానికి బాబు అండ్ కో ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు. ఆ తప్పులు భూ తద్దంలో చూపటం ప్రజల్లో అపోహలు సృష్టించటం, ఏదో జరిగిపోతుందని ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారు. ఇసు క వ్యవహారం, రాజధాని నిర్మాణం, వరదలు, కోడెల ఆత్మహత్య, సచివాలయ పరీక్షలు, గ్రామ, వార్డు వాలంటీర్లు, ఎక్సైజ్ కొత్తపాలసీ, హైకోర్టు మార్పు వదంతి , పోలవరం నిర్మాణం, విద్యుత్ కొనుగోళ్లపై సమీక్ష ఒక్కటేమిటీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి అంశం లోనూ చంద్రబాబు అండ్ కో చేస్తున్న విషప్రచారం వెర్రితలలు వేస్తోంది. ఈ దశలో జాతీయ మీడియా సైతం రాష్ట్రంలో ఏదో జరిగి పోతున్నట్లు చంద్రబాబు కోణంలోనే ప్రచారం చేయటం గమనార్హం.
రూపాయి పనిచేసి కూడా... పావలా ప్రచారం పొందలేకపోతున్నారు
ఒకప్పుడు చంద్రబాబు టీమ్ ను ముప్పతిప్పలు పెట్టిన వైఎస్సార్ సీ పీ టీమ్ నిస్సారంగా మారింది. టీడీపీ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేసిన వైసీపీ నాయకులు స్థబ్దుగా మారారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు ఏదో ప్రయోజనం చేకూరుతుందని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. వైసీపీ సోషల్ మీడియాకు పనిచేసిన వారు ఈ విధంగా ఆశించటంలో తప్పలేదు. అయితే ప్రభుత్వ పరంగా వీరికి ఎటువంటి హామీ లభించలేదు . ఎంపీ విజయసాయి రెడ్డి ఒక్కసారి సమావేశం ఏర్పాటు చేసి ఏదో చేస్తామని చెప్పినా ఆదీ ఆమలులోకి రాలేదు. మరోవైపు మంత్రి పదవులు పొందిన వారు, పార్టీ తరుపున గెలిచిన వారు కూడా టీడీపీ ఆరోపణలకు ధీటుగా బదులు ఇవ్వటంలో వైఫల్యం చెంచారు. పావలా పనిచేసి రూపాయి ప్రచారం పొందిన టీడీపీ ప్రభుత్వంతో పోల్చి చూస్తే రూపాయి పని చేసికూడా పావలా ప్రచారం పొంద లేకపోవడం విచారకరం. ఈ ధోరణి ప్రమాదకరం. ఏ పని చేయకుండా ప్రచారంతోనే అన్నీ చేస్తామని ప్రజల్ని నమ్మించటం ఎంతటీ ఆవివేకమో, ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కూడా వాటి గురించిన కనీస ప్రచారం లేకపోవటం కూడా అంతే అవివేకమౌతుంది. ఒక్క జగన్ ఆనుకూల మీడియా సాక్షిలో వచ్చే కథనాలు తప్ప మరే ఇతర మీడియాలో ఆయా పథకాలపై పాజిటివ్ ప్రచార చోరణి కనిపించడంలేదు. ఈ క్రమంలో జరుగుతున్న పొరపాట్లపై సమీక్ష చేసుకుంటూ తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకొనే ప్రయత్నం చేయటం, వాటిని సరిదిద్దుకోవటంతో జగన్ తాను ఆశించిన లక్ష్యాన్నీ సాధించే అవకాశం ఉంది.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి