ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వైద్యులపై పడగ విప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కర్నూలు లో రెండు రూపాయల డాక్టర్ గా పేరుగాంచిన ప్రముఖ పేదల వైద్యుడు డాక్టర్ ఇస్మాయిల్ కరోనా తో అసువులు బాయడం కర్నూలు వాసులకు తీరని లోటు... ఇప్పుడు కర్నూలు ఎం.పీ శింగరి సంజీవ్ కుమార్ తమ కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని, అందులో నలుగురు డాక్టర్లు ఉన్నారని స్వయంగా ప్రకటించి సంచలనం లేపారు. సంజీవ్ కుమార్ కూడా కర్నూలు లో ప్రముఖ డాక్టర్. గత ఎన్నికల్లో తొలిసారిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. అరంగేట్రమ్ తోనే ఏకంగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున కర్నూలు ఎం.పీ టిక్కెట్ సాధించడమే కాక విజయం సాధించి లోక్ సభలో అడుగు పెట్టారు. ఆయన బంధువర్గం లో మొత్తం 22 మంది డాక్టర్లు ఉండగా, వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంతకూ ముందే నెల్లూరులో ఒక ప్రైవేట్ డాక్టర్ కరోనా బారిన పడి మరణించాడు.
ఇదిలా ఉండగా గుంటూరు జిల్లా నరసరావు పేట లో ఓ ప్రముఖ డాక్టర్ కు కరోనా సోకిందన్న వార్త జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ డాక్టర్ కు కరోనా సోకడంతో ఆయనతో పాటు ఆ ఆస్పత్రి సిబ్బంది, ఆయన వద్ద చికిత్స చేయించుకున్న 167 మంది అవుట్ పేషేంట్ లను కూడా క్వారంటైన్ కు తరలించామని గుంటూరు రూరల్ ఎస్పీ విజయా రావు స్వయంగా వెల్లడించారు.
ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు వంద మంది డాక్టర్లు, 150 మందికి పైగా నర్సులు , 150 నుంచి 200 వరకు మెడికల్ వర్కర్లు, ఆస్పత్రి సిబ్బంది కరోనా బారిన పడ్డారు. కరోనా కల్లోల సమయంలో నిజమైన ప్రత్యక్ష దేవుళ్లుగా ప్రజల మన్ననలు అందుకుంటున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కూడా కరోనా బారిన పడటం ఆందోళన కలిగించే విషయం. ఏది ఏమైనా ప్రభుత్వం వైద్య రంగంలో పనిచేస్తున్న వారందరికీ పీ.పీ.ఈ కిట్లు సమకూర్చి వారికి ఎటువంటి హాని కలుగకుండా చూడాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి