ఇప్పుడు చావుకు చచ్చేచావు వచ్చింది. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించడం పెను సవాల్గా మారిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. తమిళనాడు పబ్లిక్ హెల్త్ యాక్ట్ ప్రకారం కరోనా సోకి మరణించిన వ్యక్తి అంత్యక్రియలను, దహన ప్రక్రియను అడ్డుకుంటే నేరంగా పరిగణిస్తారు. జరిమానాతో పాటు ఒకటి నుంచి మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.
తమిళనాడులో ఇటీవల కరోనా సోకి మరణించిన వారి అంత్యక్రియలకు స్థానికులు అడ్డు తగులుతున్న ఘటనలు వెలుగుచూశాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించి ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో.. తమిళనాడు ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ను చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు ఇటీవల వెలుగుచూశాయి. గుంటూరులో కరోనాతో మరణించిన ఓ వ్యక్తి దహన ప్రక్రియ వివాదాస్పదమైంది.
స్తంభాలగరువులో గల మహాప్రస్ధానంలో కరోనా పాజిటివ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అంబులెన్స్ వచ్చింది. విషయం తెలుసుకున్న స్థానికులు మహాప్రస్థానం రోడ్డులో ఆటోలు, బండ్లు అడ్డంపెట్టి నిరసనకు దిగారు. కొద్దిరోజుల కిందట ఇక్కడ పాజిటివ్ మృతదేహాలకు అత్యక్రియలు జరిగాయి. ఆ సమయంలో గ్యాస్ హీటర్పై దహనం చేస్తున్నామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే అందుకు భిన్నంగా కట్టెలపై దహనం చేయడంతో స్ధానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి శుక్రవారం కూడా కట్టెలతోనే దహనం చేస్తారని భావించిన స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
మహాప్రస్థానం ప్రతినిధి లక్ష్మణరావు వచ్చి మృతదేహాన్ని గ్యాస్పై దహనం చేస్తున్నామని వారికి సూచించారు. 800 డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతతో మృతదేహాన్ని దహనం చేస్తామని బాయిలర్ను వారికి చూపారు. పొగ గొట్టం 100 మీటర్ల ఎత్తులో ఉంటుందని తెలపటంతో శాంతించారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి