సామాన్యుడు బోనెక్కితే .
సామాన్యుడు సమాజంలో అశాంతి, అసహనం ప్రజల కషాలపై సర్వోన్నత న్యాయస్థానాన్ని అశ్రయిస్తే అతని వాదన ఎలా ఉంటుందన్న విషయంపై ఈ కథనం.
యువరానర్….
నేను ఈ దేశంలో పుట్టి పెరిగిన వాణ్ణి. ఈ మట్టి మీద అమితమైన ప్రేమానురాగాలు కలిగినవాణ్ణి. జాతిపిత మహాత్మాగాంధీ అహింసాయుత సిద్దాంతంపై అమితమైన విశ్వాసం ఉన్నవాణ్ణి. ఈ స్వేచ్చ సమానత్వం, సౌబ్రాతృత్వాలతో శాంతియుత వాతావరణంలో జీవించగలగాలని కోరుకునేవాణ్ణి. కాని ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు వారి వారి స్వార్గాల కోసం కుల, మత, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతూ సమాజంలో అశాంతిని సృష్టిస్తున్నాయి. ఆ అశాంతిలో నుంచి రేగిన మంటల్లో చలి కాచుకుంటూ ఆ వెచ్చని నెగళ్లలో అధికార సౌఖ్యాలను అనుభవిస్తున్నాయి. వారు రేపిన మంటల్లో పాపం ఎందరో సామాన్యులు, నిర్భాగ్యులు, అభాగ్యులు శలభల్లా మాడి మసై పోతున్నారు. ఆ అమాయకుల శవాలను ఒకదానిపై ఒకటి పేర్చి రాజకీయ నాయకులు ఆ శవాల నిచ్చెనపై రాజకీయ పరమపద సోపాన పటంలో ఒక్కో అడుగు వేసూ అధికార పీఠం అధిష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ చితుల్లోంచి. మండుతున్న ఆ శవాల మసిబొగ్గుల్లోంచి రేగిన సుడిగాలిలో ఎగిరొచ్చిన నిప్పరవ్వలు పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ . ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో.ఉత్తర తెలంగాణలో పెనుమంటలు సృష్టించాయి. ప్రభుత్వం ఆ నిప్పరవ్వలకు నక్సలైట్ల అని పేరుపెట్టింది. పేద ప్రజలు తమకు వెలుగు దారి చూపే టార్చిలైట్లు అనుకుంటున్నారు. గత అయిదు దశాబ్దాలుగా ఆ నిప్పరవ్వలు అక్కడక్కడా మిణుగురు పురుగుల్లాగా మిణుకుమిణుకుమంటూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఆ మిణుగురు పరుగులను సమూలంగా భస్మీపటలం చేస్తామని ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు వ్యాధి మూలకారణం తెలుసుకోకుండా. గుడ్డిగా వైద్యం చేస్తున్నాయి. నిజం చెప్పాలంటే తెలియక కాదు. తెలిసే చేస్తున్నాయి. సమాజానికి సోకిన ఈ చర్మ వ్యాధికి పైపైన ఎన్ని లేపనాలు పూసినా అవి పూసిన చోట తగ్గి, మళ్లీ కొన్నాళ్లకు వేరే చోట పుట్టుకు రావడం ఖాయం. రోగ మూలకారకం కనిపెట్టి లోనికి మందు వేస్తేనే వ్యాధి సమూలంగా నయమవుతుంది. కాని ప్రభుత్వాలు, అధికారులు వారి వారి స్వార్గాల కోసం వ్యాధిని నయం చేయకుండా కావాలని తాత్సారం చేస్తున్నారు. తద్వారా వారు ఆర్థిక , రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారు. శవాలపై పైసలు ఏరుకునే వెధవలు, చితిమంటల్లో బొగ్గులేరుకునే సన్నాసులు అధికార పీఠం పైకి ఎక్కి నా తల్లి భరతమాత అంగాంగాన్ని కుళ్ళబొడుస్తూ చిత్రహింసలు పెడుతున్నారు. సో. యువరానర్........ ఈ దేశ అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవిలో ఉన్న మీరు తక్షణం వీరిపై చర్య తీసుకుని నా దేశాన్నిసారీ. మన దేశాన్ని కాపాడగలరని అభ్యర్థిస్తున్నాను.
.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి