Translate

  • Latest News

    14, సెప్టెంబర్ 2017, గురువారం

    తడిగుడ్డ తో గొంతు కోయటమంటే ఇదే నేమో..


    పెట్రో ధరల విషయంలో కేంద్రం కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు వ్యవహరిస్తోంది. రోజుకో పైసా, పది పైసలు ఎక్కువలో ఎక్కువ 20 -30 పైసల చొప్పున పెంచుతూ రెండున్నర నెలల వ్యవధిలో గుట్టుచప్పుడుకాకుండా జనం జేబుకు పెద్ద చిల్లే పెట్టింది. రోజువారీ ధరలు అమల్లోకి వచ్చిన జూన్ 16 నుంచి సెప్టెంబర్‌ 13 మధ్య కాలంలో పెట్రోల్‌ ధర దాదాపు ఏడున్నర.. హై స్పీడ్‌ డీజిల్‌ ధర ఐదున్నర రూపాయలకు పైగా పెంచేసింది. ఇలా రోజుకు కొంత మొత్తం చొప్పున వినియోగదారులకు తెలియకుండానే ధరల భారాన్ని మోపుతోంది. జిమ్మిక్కులు ప్రదర్శిస్తూ జనం చేతి చమురు వదిలిస్తోంది. ఒక్క రూపాయి ధర పెరిగితే రోడ్డేకే కామ్రేడ్ లకు తెలియకుండా పెట్రో ధరలు పెంచే సంసృతికి మోదీ ప్రభుత్యం తెరలేపింది తెరలేపింది. 
    ఈ ఏడాది జూన్‌ 15 వరకు ఆయిల్‌ కంపెనీలు ప్రతి 15 రోజులకోసారి పెట్రో ధరలను సమీక్షించేవి. అంటే ఇంటర్నేషనల్  మార్కెట్లో క్రూడాయిల్  రేట్లకు అనుగుణంగా నెలలో రెండుసార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పులు జరిగేవి. కానీ జూన్ 16 నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెట్రో ధరల రోజువారీ సమీక్ష విధానం అమల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఆయిల్ కంపెనీలు రోజుకు చారాణా నుంచి ఆఠాణా వరకు ధరలు తగ్గించాయి. దీంతో జనం కూడా ఈ విధానం బాగానే ఉందనుకున్నారు. కానీ ఆ తర్వాతే ఆయిల్ కంపెనీల అసలు కథ మొదలైంది. దీంతో జులై నుంచి పెట్రో ధరల్లో పెరుగుదలే తప్ప తగ్గుదల కనిపించలేదు.
    జులై నుంచి పెట్రోల్‌ డీజిల్‌ ధరలను పెరిగిన విధానాన్ని గమనిస్తే.. జులై ఒకటిన లీటర్‌ పెట్రోల్‌ ధర 66 రూపాయల 93 పైసలుండగా, లీటర్‌ డీజిల్‌ ధరను 58రూపాయల 09పైసలుగా నిర్ణయించారు. జులై 16న పెట్రోల్‌ 68రూపాయల 4పైసలు డీజిల్‌ ధర 59 రూపాయల 74 పైసలకు చేరింది. జులై 31న లీటర్‌ పెట్రోల్‌ ధర 69రూపాయల 26పైసలకు చేరగా.. డీజిల్‌ ధర 60రూపాయల 36 పైసలకు పెరిగింది. అంటే ఒక్క జులై నెలలోనే ఆయిల్ కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 2 రూపాయల 25 పైసలు, లీటర్‌ డీజిల్‌ పై 2రూపాయిల 27  పైసల మేర పెంచేశాయి. ఆగస్టులో 1న లీటర్‌ పెట్రోల్‌ ధర 69 రూపాయల 18పైసలుగా ఉండగా… హై స్పీడ్‌ డీజిల్‌ ధర 60 రూపాయల 30 పైసలుగా నమోదైంది. ఆగస్టు 16 నాటికి ఈ ధరలు 72 రూపాయల 9పైసలు, 62 రూపాయల 24పైసలకు చేరాయి. ఆగస్టు 31న లీటర్‌ పెట్రోల్‌ ధర 73 రూపాయల 16 పైసలకు చేరగా.. డీజిల్‌ ప్రైస్‌ 61 రూపాయల 90 పైసలకు ఎగబాకింది. ఆగస్టు నెలలో ధరల పెరుగుదలను గమనిస్తే ఈ ఒక్క నెలలోనే లీటర్‌ పెట్రోలుపై 4 రూపాయల వరకు పెంచి ఆ భారాన్ని ప్రజలపై మోపారు. అటు డీజిల్‌ ధర సైతం ఆగస్టులో రూపాయి 60 పైసల మేర పెరిగింది. సెప్టెంబర్‌ నెలలోనూ పెట్రో ధరలు పెరగడమే తప్ప ఒక్క రోజు కూడా తగ్గిన దాఖలాలు లేవు.  సెప్టెంబర్‌ 1న 73రూపాయల 21పైసలుగా ఉన్నలీటర్‌ పెట్రోల్‌ ధర 10వ తేదీ నాటికి 74 రూపాయల 19 పైసలకు చేరింది. అటు డీజిల్‌  సైతం సెప్టెంబర్‌ 1 నుంచి 13 తేదీల మధ్య రూపాయి 85 పైసల మేర పెరిగింది.
    దేశంలోని ప్రధాన నగరాలన్నింటినీలోనూ గత రెండు నెలల్లో పెట్రోల్‌ ధర 7, డీజిల్‌ ధర 5 రూపాయల మేర పెరిగింది. మరి అడ్డగోలుగా పెట్రో ధరలు పెరగడానికి కారణాలేంటి? అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా మార్కెట్‌ ధరలను సమీక్షిస్తున్నట్లు చెబుతున్న కేంద్రం ఆ పని సక్రమంగా చేస్తోందా? ఇంతకీ ఇంటర్నేషన్‌ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలే దేశంలో పెట్రో ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయా? ఈ ప్రశ్నలకు లేదనే సమాధానం చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా దేశీయ మార్కెట్‌లో పెట్రో ధరలు అడ్డగోలుగా పెరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌లో కొన్ని దశాబ్దాల పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రభుత్వమే నియంత్రించింది. అయితే ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ నియంత్రణను ఎత్తివేసి ధరలను మార్కెట్‌కు వదిలేశారు. దీంతో కొన్ని నెలల క్రితం వరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రతి 15 రోజులకోసారి సమీక్షించేవి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్‌లో రేట్లను సవరించేవి. కానీ ఇప్పుడు రోజువారీ ధరలపై కూడా ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఆయిల్ కంపెనీలు పెట్రో రేట్లు అడ్డగోలుగా పెంచేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
    ధరలు పెరగడమే తప్ప తగ్గడమంటూ ఎరుగని పెట్రో ధరలు ప్రస్తుతం మూడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరాయి. ముంబైలో ఏకంగా 79రూపాయల 50పైసలకు చేరిన పెట్రోల్ ధర 2014లో బ్యారెల్ ధర 100 డాలర్లు ఉన్నప్పటి ధరల స్థాయికి చేరింది.  గత రెండున్నర నెలల కాలంలో పెట్రో ధరలు 10శాతం పెరగగా… అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల పెరుగుదల మాత్రం ఆ స్థాయిలో లేదు. జులైలో బ్యారల్ క్రూడాయిల్ ధర 48 డాలర్లు ఉండగా.. సెప్టెంబర్ 5 నాటికి అది 52డాలర్లకు పెరిగింది. అంటే రెండున్నర నెలల్లో పెరుగుదల 4శాతం మాత్రమే అయినప్పటికీ పెట్రో ధరలు మాత్రం 10శాతానికిపైగా పెరిగాయి. నిజానికి ఇంతకన్నా దారుణంగా మరొకటి ఉంది. 2014లో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి లీటర్ పెట్రోల్ ధర 71 రూపాయల 50 పైసలుగా ఉంది. అప్పట్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 106డాలర్లు. అప్పటి నుంచి మూడేళ్లుగా ముడిచమురు ధర పతనమవుతూ ఒక దశలో 40 డాలర్లకు కూడా చేరింది. అయితే ఈ తరగుదలను ఏ రోజు కూడా వినియోగదారులకు బదిలీ చేయలేదు. 2014 మేతో పోలిస్తే ప్రస్తుతం క్రూడాయిల్ ధర సగానికి తగ్గిన్నా లీటర్ పెట్రోల్ ధర పెరిగిందే తప్ప తగ్గలేదు.
    ఇదిలా ఉంటే కేంద్రం జులై 1 నుంచి దేశంలో గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ అమల్లోకి తెచ్చింది. అయితే పెట్రో ఉత్పత్తులను మాత్రం జీఎస్టీలో చేర్చలేదు. వాస్తవానికి పెట్రో ఉత్పత్తులు కొత్త పన్ను విధానం పరిధిలోకి తెస్తే ధరలు భారీగా తగ్గుతాయి. భారత్‌లో పెట్రోల్‌ బేస్‌ రేటు కన్నా పన్నులే అధికంగా ఉన్నాయి. కొనుగోలు ధరకు, ప్రాసెసింగ్‌ ఫీజు, రవాణా వ్యయం, ఎక్సైజ్‌ డ్యూటీ, డీలర్‌ కమిషన్‌, వ్యాట్‌ కలుపుతుండటంతో పెట్రోల్‌ ధర బేస్‌ రేటు కన్నా రెండింతలు ధరకు విక్రయిస్తున్నారు. అందుకే ప్రభుత్వ ఆదాయ వనరుల్లో  ప్రధానమైనది కావడంతో సర్కారు పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీలో చేర్చలేదు. ఫలితంగా పెట్రో ధరలు అడ్డుఅదుపూ లేకుండా పెరిగిపోతున్నాయి.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: తడిగుడ్డ తో గొంతు కోయటమంటే ఇదే నేమో.. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top