సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో నెలవారీ సగటు నిల్వ లేనప్పుడు విధించే చార్జీల గురించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) స్పష్టమైన వివరణ ఇచ్చింది. కొన్ని రకాల ఖాతాలకు ఈ చార్జీల మినహాయింపు ఉన్నట్టు తెలిపింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన (పిఎంజెడివై), చిన్న ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలకు కనీస సగటు నిల్వ నిబంధన వర్తించదని, ఈ ఖాతాల నుంచి ఎలాంటి చార్జీలను వసూలు చేయబోమని పేర్కొంది. ఎస్బిఐ వద్ద ఉన్న 40 కోట్ల సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లో 13 కోట్ల ఖాతాలు ఈ మినహాయింపు కేటగిరీ పరిధిలోకి వస్తాయని తెలిపింది. తమ సేవింగ్స్ ఖాతాలో నెలవారీ సగటు నిల్వలను ఉంచలేని కస్టమర్లు తమ ఖాతాను బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాకు మార్పిడి చేసుకోవచ్చని,ఇందుకు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.సమాజంలో పేదల కోసం బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతా సదుపాయాన్ని తెచ్చినట్టు బ్యాంకు పేర్కొంది. ఇలాంటి ఖాతాలపై ఎలాంటి చార్జీలు గానీ ఫీజు గానీ ఉండదని, ప్రజలు పొదుపు చేసుకోవడానికి ఈ ఖాతాలు ఉపయోగపడతాయని బ్యాంకు తెలిపిందఅయితే ఈ ఖాతా ద్వారా నిర్వహించే లావాదేవీలపై కొన్ని రకాల ఆంక్షలు ఉంటాయని పేర్కొంది. ఈ ఖాతాదారులు నెల రోజుల్లో నాలుగుసార్లు మాత్రమే నగదును ఉచితంగా తమ ఖాతాలోంచి తీసుకోవచ్చని, ఈ నిబంధన ఎటిఎం విత్డ్రాయల్స్కు కూడా వర్తిస్తుందని తెలిపింది. పరిమితి దాటిన తర్వాత బ్రాంచ్ నుంచి ఒకసారి డబ్బు ఉపసంహరించుకుంటే 50 రూపాయలతోపాటు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇతర బ్యాంకు ఎటిఎంలో అయితే 20 రూపాయలతోపాటు పన్ను, ఎస్బిఐ ఎటిఎంలో అయితే 10 రూపాయలతోపాటు పన్ను చెల్లించాల్సి ఉంటుంది
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి