అసలు వైకాపాలో ఏం జరుగుతోంది.రోజుకొక ఎమ్మెల్యే ముఖ్యనాయకులు చేజారిపోతుంటే ఏం చేస్తున్నారు. అసలు పీకే టీమ్ ఏం చేస్తుంది. జారిపోతున్న ఎమ్మెల్యేలను నాయకులను పార్టీ సీనియర్లు, ముఖ్యనాయకులు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు. నిన్నటివరకు జగన్ జపం చేసిన వారు ఎందుకు ఒక్కసారి గా ప్లేట్ ఫిరాయిస్తున్నారు. ఇప్పడు సగటు వైకాపా నాయకుడిలో ఉదయిస్తున్న ప్రశ్నలు.
నీరు పల్లం వైపు. రాజకీయనాయకులు అధికార పార్టీ వైపు వెళ్లటం నైతిక విలువలు కోల్పోయిన రాజకీయాల్లో సహజంగా మారింది. అయితే నేటి రాజకీయాల్లో విలువలు, ప్రజాస్వామ్యం అంటూ మడి కట్టుకొని కూర్చొంటే ముందుకు సాగవు. అలాంటి వారు ఉంటే లోకసత్తా జయప్రకాశ్ నారాయణ్లా మిగిలిపోకతప్పదు. అదంతా వేరే చర్చ. జగన్ పాదయాత్ర మొదలు పెట్టినప్పడే భిన్నస్వరం జరిగే పరిణామాలను పలు కథనాలుగా వెలువరించింది. పక్కాగా అలాగే జరుగుతోంది. చంద్రబాబు వ్యూహం ముందు వైకాపా నాయకుల పథకాలు పారటం లేదు. ఒక వైపు వైకాపా అధినేత జగన్ పాదయాత్రలో ఉంటే ఆయన ఒక్కో అడుగు ముందుకు పడేకొద్ది పక్కనే ఉన్న నాయకులు ఒక్కర్కొరే చంద్రబాబు సరసన చేరుతున్నారు. ఒకవైపు పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆనందపడాలో జారిపోతున్న ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలను చూసి బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది.
ప్రతివ్యూహం ఏది..? వైకాపా నుంచి ఎవరెవరు .పార్టీ వీడనున్నారు.? వారిని ఎవరు టార్గెట్ చేస్తున్నారు. వారిని నివారించటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై స్పష్టత కరువైంది. ఇక్కడే సరైన వ్యూహం అవసరమవుతోంది. వైకాపా లో సైతం ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. రాజకీయ వ్యూహకర్తలు ఉన్నారు. వారంతా ఏం చేస్తున్నారన్న విషయం కూడా అర్థం కాకుండా ఉంది. గిడ్డి ఈశ్వరితో నేరుగా జగన్ సతీమణి భారతి బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు పార్టీ మారిన ఈశ్వరి తెలిపారు. మరి సీనియర్ల సేవలను ఎందుకు వాడుకోవటం లేదు. వారికి జగన్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సారి ఎన్నికలు వైకాపాకు జీవన్మరణ సమస్య ఎట్టి పరిస్థితిలోనూ అధికారం చేపట్టాలి. ప్రత్యర్థి పార్టీకి ధీటుగా సరైన వ్యూహరచన చేయకపోతే కష్టాలు తప్పవు. .మరి ఈ అంశంపై ఏం నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి