రాజస్థాన్లోని ప్రముఖ హిందీ దినపత్రిక రాజస్థాన్ పత్రిక గురువారం ఎడిటోరియల్ కాలమ్ను బ్లాంక్గా వదిలేసి ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల తన నిరసన వ్యక్తం చేసింది. మీడియా స్వేచ్ఛకు గుర్తుగా భావించే నేషనల్ ప్రెస్ డే(నవంబర్ 16)ను అందుకు ఎంచుకున్నది. రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై కథనాలు రాయకుండా మీడియాపై ఆంక్షలు విధిస్తూ వసుంధరారాజే ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చినందుకు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా రాజస్థాన్ పత్రిక నిరసన తెలిపింది. ఎడిటోరియల్ కాలమ్ చుట్టూ పెద్ద నల్లగీతతో నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సంపాదకీయ కాలమ్పై 'నల్ల చట్టం జర్నలిజాన్ని ప్రమాదంలోకి నెట్టింది. ఈ చట్టంతో ప్రజాస్వామ్యాన్ని హత్యగావించడాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ ఎడిటోరియల్ను బ్లాంక్గా వదిలేస్తున్నాం' అంటూ ఆ పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ గులాబ్ కొఠారీ ప్రకటించారు.
ప్రభుత్వ అధికారులు, న్యాయమూర్తులు, రిటైర్డ్ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ నేర చట్లాలు(రాజస్థాన్ సవరణ) ఆర్డినెన్స్-2017 పేరుతో సెప్టెంబర్ 6న వసుంధరారాజే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది.
అనుమతిలేని కేసుల్లో అవినీతి ఆరోపణలతో కథనాలు రాస్తే మీడియాపైనా చర్యలను ఆ ఆర్డినెన్స్లో పేర్కొన్నారు. దీంతో, ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరారాజే కార్యక్రమాలను రాజస్థాన్ పత్రిక బహిష్కరిస్తోంది. ఆర్డినెన్స్ ఆరు నెలల వరకూ అమలవుతుంది. ఈలోగా అసెంబ్లీలో ఆమోదం పొందితే అది చట్టంగా రూపొందుతుంది. అక్టోబర్ 23న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు పట్ల ప్రతిపక్షం నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో రాజే ప్రభుత్వం దీనిని సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపింది. మరోవైపు ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా 8 పిటిషన్లు రాగా, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు రాజస్థాన్ హైకోర్టు జోధ్పూర్, జైపూర్ బెంచ్లు నోటీసులు జారీ చేశాయి.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి