త్రిపుర రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత అయినా మార్క్సిస్టులు ఆత్మావలోకనం చేసుకోవాలి. పాతికేళ్ళు అధికారంలో ఉండి కూడా ఆ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడానికి దారి తీసిన పరిణామాలపై విస్తృతంగా చర్చించాలి. ఈశాన్య రాష్ట్రాలు ఎంతో కాలంగా అభివృద్ధికి దూరంగా ఉన్నాయని, ఇన్నాళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, రాష్ట్రంలో అధికారంలో ఉన్న సిపిఎం త్రిపుర లో అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, తమకు ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం అని బిజెపి చెప్పిన మాటలను ఆ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు. కేవలం మాణిక్ సర్కార్ నీతి, నిజాయితీలు, వ్యక్తిగత ప్రతిష్ట, నిరాడంబర జీవనం ఒక్కటే ఎన్నికల్లో గెలిపించడానికి దోహదపడవన్న సంగతి గ్రహించి, ఇకనైనా తమ తప్పుల్ని తెలుసుకొని, వాటిని సరిదిద్దుకోకపోతే దేశంలో వామపక్షాలనేవి ఎక్కడ లేకుండా కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. దేశం అంతా 7 వ పే కమిషన్ ఉంటే అక్కడ ఇంకా 4 వ పే కమిషన్ మాత్రమే అమల్లో ఉందని, ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క గువహటి తప్ప ఏ రాష్ట్ర రాజధానికి కనీసం రైల్ కనెక్టయివిటీ లేదని, ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని బీజేపీ ఆయా రాష్ట్ర ప్రజల్లో బలంగా నాటుకునేలా చెప్పగలిగింది. తమకు ఒక్కసారి అవకాశం ఇస్తే మొత్తం ఈశాన్య రాష్ట్రాల స్వరూపం మార్చేస్తామని చెప్పిన మాటల్ని ఈశాన్య ప్రజలు విశ్వసించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బీజేపీ చెప్పిన మాటలను నమ్మారు.
ఏది ఏమైనా... పాతికేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఎటువంటి ఆస్తులు సంపాదించుకోకుండా, అత్యంత నిరాడంబరుడిగా జీవనం సాగించే త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ప్రభుత్వం ఓటమి ప్రజాస్వామ్య వాదులందరికి సిగ్గుచేటు. నీతికి, నిజాయితీకి మారుపేరైన మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని చేజేతులారా ఓడించుకున్నారు. సిపిఎం ప్రజల మనోభావాల్ని గౌరవించి, ఇకపై తదనుగుణంగా తమ వైఖరి మార్చుకుని, తిరిగి ఆ రాష్ట్ర ప్రజలు విశ్వాసాన్ని చూరగొనడానికి సరైన దిశగా ప్రయత్నం చేయకపోతే దేశంలో ఉన్న కమ్యూనిస్టు అభిమానులు ఆ పార్టీని క్షమించరు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి