ఎన్నాళ్లీ మారణ హోమం..? ప్రజల కోసం పోరాటమంటూ ప్రాణ త్యాగాలు... ఉగ్రవాదం పై ఉక్కుపాదం అంటూ ప్రభుత్వాల దమన కాండ... ప్రాణాలు ఎవరివైనా విలువైనవే... అవి పోలీసులవైనా... నక్సలైట్లవైనా... ఉరి శిక్షనే రద్దు చేయాలంటూ పోరాటం చేసిన మావోయిస్టులు వేరొకరి ప్రాణాలు తీయడం సమంజసం కాదు.. ఎన్ కౌంటర్ ల పేరుతొ పోలీసులు నక్సలైట్లను పట్టుకుని కాల్చేయడం అంతకన్నా ఘోరం...
మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా ఉన్న మహారాష్ట్ర లోని గడ్చిరోలి లో నక్సలైట్లు ఒక ఏ.ఎస్.ఐ ను చంపారన్న కక్షతో పోలీసులు 37 మంది మావోయిస్టులను అమానుషంగా కాల్చి చంపడం ఘోరాతి ఘోరం. మృతుల సంఖ్య తొలుత 16 అని సమాచారం వచ్చింది. తర్వాత అక్కడే ఖండల అటవీ ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్ లో మరో ఆరుగురు చనిపోయారని మరో వార్త. ఇది ఇలా ఉంటె ఎన్ కౌంటర్ లో మృతులు 20 మంది పైనే ఉండవచ్చని, కొన్ని మృతదేహాలను మావోయిస్టులు తీసుకెళ్లిపోయారని వార్తలు వినపడ్డాయి. ఈ నేపథ్యంలో... ఎన్ కౌంటర్ జరిగిన రెండు రోజుల తర్వాత ఘటన ప్రాంతానికి సమీపంలో ఇంద్రావతి నదిలో 15 మృత దేహాలు కొట్టుకుపోయి తేలియాడుతున్నట్టు వచ్చిన వార్తలు విని మానవత్వం ఉన్న ఏ హృదయమైనా చలించక మానదు. మొత్తం మూడు రోజుల్లో 33 మంది మావోయిస్టులు బలయ్యారు. నిజంగా ఎన్ కౌంటర్ అయితే మరి పోలీసులు ఒక్కళ్ళు కూడా చనిపోకపోవడం... కనీసం గాయపడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ప్రధానికయినా... సామాన్యుడికయినా... పోలీసుకయినా ... నక్సలైట్ కయినా ఉన్నది ఒకటే జన్మ... ఈ సృష్టిలో అత్యున్నత మేధా శక్తులు కల మానవ జన్మ... అందుకే నిండు నూరేళ్లు జీవించమని పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. రాను..రాను సగటు ఆయుష్ ప్రమాణం 70.. కి పడిపోయిందనుకోండి... ఉన్న ఆ ఒక్క జన్మను పూర్తి కాలం జీవించకుండా మావోయిస్టులు సమసమాజం కోసం కలలు కంటూ అనవసరంగా ప్రాణత్యాగాలు చేయడమూ కరెక్ట్ కాదు. అలాగే మావోయిస్టులను సజీవంగా పట్టుకుని చట్టానికి అప్పగించే అవకాశం ఉన్నా కక్షపూరిత వైఖరితో... అమానుషంగా కాల్చి చంపడం మానవ ధర్మం కాదు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తేవడానికి భావ విప్లవం తేవడానికి మేధావులంతా కృషి చేయాలి. అదే సమయంలో ప్రభుత్వాల దమన నీతిని నిర్ద్వద్వంగా ఖండించాలసిందే...
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి