దక్షిణాది రాష్ట్రాలల్లో ముఖ్యంగా ఏపీలో అందని ద్రాక్షలా ఉన్న అధికార పీఠం ఎలాగైనా చేజెక్కించుకోవాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తనకు బాగా అచ్చివచ్చిన కులసమీకరణాలపైనే దృష్టి పెట్టింది. గత ఏడాది ఉత్తరప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సమీకరణల ద్వారానే అనూహ్యంగా అధికార పీఠం అధిష్టించింది. ఇప్పుడు ఏపీలో ఇదే మంత్రం పఠిస్తోంది. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన రాజకీయపక్షాలు రెండు ప్రధాన సామాజికవర్గాలకు చెందినవి. ఆ రెండు పార్టీల్లో ఏది అధికారంలోకి వచ్చినా ఆయా సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులే ముఖ్యమంత్రులు అవుతారన్నది అందరికి తెలిసిందే. ఈ రెండు సామాజిక వర్గాలు కాకుండా రాష్ట్రంలో మూడవ బలమైన సామాజిక వర్గానికే ముఖ్యమంత్రి పదవి రావాలంటే ఆ రెండు పార్టీల వల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను సాధ్యం కాదన్నది బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో తమ పార్టీకి ఓటువేస్తే ఆ వర్గానికి ముఖ్యమంత్రి పదవి గ్యారెంటి అనే హామీ ఇవ్వడం ద్వారా బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగానే కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నాలక్ష్మీనారాయణకు బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. దాంతో పాటు కాపుల్లో మరో బలమైన నాయకుడిగా ఉన్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ను కూడా లైన్లో పెట్టినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ముద్రగడ ఆదివారం నాడు ఆఘమేఘాలపై గుంటూరు వచ్చి కన్నాతో బేటి అయ్యారు. అధికారమే పరమావధిగా బీజేపీ ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో తన మౌలిక సిద్దాంతాలకు కూడా తిలోదకాలు ఇచ్చింది. అక్కడక్కడా దీనిపై పార్టీలో నిరసనలు వినిపించినప్పటికి ప్రస్తుతం బీజేపీలో మోడీ,షాల మాట కు తిరుగులేదు. అయితే ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి రంగంలో ఉన్నప్పటికి అతని నిలకడలేని రాజకీయాల వల్ల కాపుల్లో యువతరం తప్ప పెద్దతరం ఇతన్ని విశ్వసించలేకపోతుంది. కాపు పెద్దల్లో ముద్రగడకు పలుకుబడి ఎక్కువుంది. సో కాపుల్లో ఉద్యమనేత ముద్రగడతో పాటు క్రీయాశీలక రాజకీయాల్లో గత మూడు దశాబ్దాలుగా ఉండటంతో పాటు ఐదు సార్లు ఎమ్మెల్యెగా 15 ఏళ్లు మంత్రిగా , ఒకానొక దశలో కాంగ్రెస్లో సీఎం అభ్యర్ధిగా (కిరణ్కుమార్రెడ్డికి ముందు) వార్తల్లోకి ఎక్కిన కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్ర పగ్గాలు అప్పగించటం ద్వారా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
అయితే ప్రత్యేక హోదా విషయంలో ఆడి తప్పిన బీజేపీపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్న పరిస్థితుల్లో కేవలం కాపు సామాజిక వర్గం పై ఆధారపడి బీజేపీ అధికారం చేజిక్కించుకోవాలన్న ప్రయత్నం కొండకు వెంట్రుక వేయటం లాంటిదే అని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి