దేశంలో సరిగ్గా నేటికీ 43 ఏళ్ల కిందట ఇదే రోజు(1975 జూన్ 25) అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. ఆ నిర్ణయమే ఆ తర్వాత రెండేళ్లకు 1977 లో జరిగిన ఎన్నికల్లో ఆమెను పదవీచ్యుతురాలిని చేసింది. అప్పటి ప్రతిపక్షాలలో ఒకటైన జనసంఘ్ 1980 లో బి.జె.పీ గా మారింది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది. విచిత్రమేమిటంటే అప్పుడు ఎమర్జెన్సీ ని వ్యతిరేకించిన బి.జె.పీ పాలనలో గత నాలుగేళ్లుగా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. హిందుత్వ రాజకీయాలను నడుపుతూ హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఒక పధకం ప్రకారం అంతమొందిస్తున్నారు. దబోల్కర్, గోవింద్ పన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేశ్ వంటి కమ్యూనిస్ట్, హేతువాద దృక్పధం కల మేధావులను, జర్నలిస్ట్ లను కాల్చి చంపడం, పైగా ఇలాంటి వారిని చంపడానికి ఓకే ప్రత్యేక టీమ్ ను తయారుచేసి వదలడం, బీఫ్ తిన్నారని మనుషుల్ని చంపదం, ఆవును చంపారని మనుషుల్ని చంపడం, మహారాష్ట్రలో దళితులు తమ పూర్వీకుల విజయాలను స్మరించుకుంటూ ఉత్సవాలను చేసుకున్నందుకు కక్ష కట్టడం, వాళ్ళను దేశ ద్రోహులుగా చిత్రించడం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో రోహిత్ ఆత్మహత్యకు దారి తీసే పరిస్థితులు సృష్టించడం, ఢిల్లీ యూనివర్సిటీ కన్హయ్య అరెస్ట్ ఉదంతం, ఎస్.సి., ఎస్.టి అట్రాసిటీ చట్టం మార్పులు చేసే యత్నం, ప్రతిఘటన ఉద్యమంలో భారత్ బంద్ లో 10 మందిని కాల్చి చంపడం, దాదాపు 90 శాతం వికలాంగుడైన ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబా ను రెండేళ్ల కిందట మావోయిస్టుగా ముద్రవేసి అరెస్ట్ చేసి, ఇప్పటివరకు బెయిల్ కూడా ఇవ్వకపోవడం, ఇటీవల మహారాష్ట్ర లో కొందరిపై మావోయిస్టు ముద్ర వేయడం, వాళ్లకు సహకరిస్తున్నారని, ఆ కుట్రలో వరవరరావు పేరు చేర్చడం ఇవన్నీ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ లక్షణాలుగానే కనపడుతున్నాయి. అంతేకాదు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో అధికారంలో ఉన్న పార్టీలకు, వ్యక్తులకి వ్యతిరేకంగా పోస్ట్ లు పెట్టిన వారిని కూడా అరెస్ట్ చేయడం కూడా అప్రకటిత ఎమర్జెన్సీయే. నియంతృత్వ ప్రభువులెవరైనా వారు అధికారంలో ఉన్నంతవరకే... ఎన్నికలొస్తే... ప్రజల చేతిలో ఓటమి తప్పదని గతానుభవాలు ఎన్నో చెప్పాయి... అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్పిన వారే గద్దె ఎక్కగానే నిరంకుశులుగా మారిపోతున్నారు. చరిత్ర పునరావృతం కాక తప్పదు సుమా...
25, జూన్ 2018, సోమవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి