రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో విజయం కోసం శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో మొదటినుంచి తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉన్న బీసీ ఓటర్లపై, అందునా ప్రధానంగా బీ.సీలలో అత్యంత వెనుకబడిన కులాలు (ఎం.బీ.సి)పై దృష్టి సారించింది. వాస్తవానికి బీ.సి లలో వందకు పైగా కులాలున్నా ఇప్పటివరకు కేవలం ఐదారు కులాలకు మాత్రమే చట్ట సభల్లో ప్రాతినిధ్యం ఉంటూ వస్తోంది. సహజంగా బీసీల్లో ఆర్ధికంగా ముందున్న కులాలైన యాదవ, గౌడ, పద్మశాలి, తూర్పు కాపు, కొప్పు వెలమ వంటి కులాలతో పాటు గవర,మత్సకారుల వంటి కులాలకు మాత్రమే ఇప్పటివరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉంది. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా మిగతా వంద కులాలకు ఇంతవరకు చట్టసభల్లో ప్రాతినిధ్యమే లేకపోవడం అత్యంత శోచనీయం. ప్రాతినిధ్యం ఉన్న ఐదారు కులాలు కూడా ఎక్కువ శాతం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాయి. బి.సి ల లో ఉన్న ఈ సామాజిక అసమానతను వై.ఎస్.జగన్ గుర్తించారు. ఈ నేపథ్యంలో బి.సి ల్లో ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని కులాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా బి.సెల్లో అత్యంత వెనుకబడిన కులాలైన రజక, వడ్డెర వంటి కులాలకు ఈసారి ఎం.ఎల్.ఏ టిక్కెట్ లు కేటాయిస్తున్నారు. రాజధాని జిల్లా అయిన గుంటూరు జిల్లాలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్.సి.పీ తరపున అభ్యర్థిగా రజక కులానికి చెందిన ఒక మహిళను ఎంపిక చేశారు. అయితే ఆమె భర్త కాపు కులానికి చెందిన వారు కావడం, పైగా ఆర్ధికంగా బాగా స్థితిమంతులు (ఎన్ఆర్.ఐ ) కావడం అదనపు బలం. కాగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ డి.ఐ.జి చంద్రగిరి ఏసురత్నం ను నియమించారు. ఈయన అత్యంత వెనుకబడిన వడ్డెర కులానికి చెందినవారు. ఈయనకు గుంటూరు వెస్ట్ టిక్కెట్ ఇస్తానని జగన్ హామీ ఇచ్చిన తర్వాతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే నాయీబ్రాహ్మణః, విశ్వబ్రాహ్మణ వంటి కులాల వారికి కూడా పాదయాత్రలో వై.ఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత నిస్తూ వరాలు ప్రకటించారు. ఇది కాక మాజీ ఎం.ఎల్.ఏ జంగా కృష్ణమూర్తి సారధ్యంలో జగన్ ఏర్పాటుచేసిన బి.సి అధ్యయన వేదిక బి.సి.ల్లో ప్రతి కులం ప్రతినిధులతో విడివిడిగా సమావేశమై వారి నుంచి నివేదికలు తీసుకుని మొత్తం కలిపి బి.సి డిక్లరేషన్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో బి.సి మహాసభ ఏర్పాటుచేసి ఆ సభలో ఆ డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. మొత్తమ్మీద జగన్ బి.సి ఓటర్లను తన వైపు మలుచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నం విజయవంతం అయితే ఎన్నికల్లో ఆయన పార్టీ గెలుపు ఖాయం అని చెప్పవచ్చు.
1, అక్టోబర్ 2018, సోమవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి