రానున్న ఎన్నికలపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఎవరి విశ్లేషణలు వారు చేసుకుంటూ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కోడ్ రాకమునుపే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఈ సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని, ప్రజల మద్దతుతో తిరిగి గద్దె ఎక్కటం ఖాయమని బాబు, టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ఇటీవల జగన్కు అనుకూలంగా వస్తున్న సర్వేలను దాటి అధికారం చేపడతామని నాయకులు భావిస్తున్నారు. ఈ దశలోనే వైసీసీ నాయకులు, క్యాడర్ కొంత కంగారు పడ్డ మాట వాస్తవమే. ఫించన్ల పెంపు, పసుపు-కుంకుమ పథకాలు తమ గెలుపు ప్రతిబంధకాలుగా మారుతాయేమో అని ఆందోళన చెందుతున్నారు.
వైసీసీ నేతలు, కార్యకర్తలల్లో నెలకొన్న అనుమానాలను జగన్ గమనించినట్లు ఉన్నారు. వారిలో మనోస్థైరం నింపటానికి అనంతపురం సభను వేదికగా ఉపయోగించుకున్నారు. ఈ విషయాలపై ఒక ఉదాహరణ చెప్పారు. ఇందుకు టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ను ఉదాహరణగా తీసుకొన్నారు. టీడీపీ పార్టీ స్థాపించి ఎన్టీఆర్ ఎన్నికలకు వెళ్లటానికి కేవలం ఎనిమిదినెలల సమయమే ఉంది. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎన్టీఆర్ కిలో రెండు రూపాయలకే బియ్యం ఇస్తామని ప్రకటించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరుపున కోట్ల విజయభాస్కరరెడ్డి సీఎం గా ఉన్నారు. ఎన్టీఆర్ ప్రకటించిన పథకాన్ని తాము కాపీ కొట్టి కిలో 1.90రూపాలయలకే ఇస్తామని ప్రకటించారు. కాని కాంగ్రెస్ పార్టీ వాగ్దనం ప్రజలు నమ్మలేదు. ఎన్టీఆర్కే పట్టం కట్టారు. ఈ ఉదాహరణ చెప్తూ ఎన్నికలకు చివరి రోజుల్లో బాబు ప్రకటించిన స్కీమ్లకు ప్రజలు మోసపోరని తమకే పట్టం కడతారని చెప్పుకొచ్చారు. తమ నవరత్నాల పథకాలను కాపీ కొడుతున్నారని, కనీసం వాటిని సక్రమంగా కాపీ కొట్టడం కూడా బాబుకు చేతకావటం లేదని ఎద్దేవా చేశారు.
బాబు ఎన్నికల పథకాలు ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని ఆ పార్టీ కూడా గ్రహించినట్లుంది. ఈ పరిస్థితిని అధిగమించటానికి రానున్న రోజుల్లో జగన్ రాష్ట్ర ప్రజలకు కొత్తగా మరి కొన్ని పధకాలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో నవరత్నాల పథకంలో ఫించన్ రెండు వేలు చేస్తామని ప్రకటించినప్పుడు బాబు ఈ పథకాన్ని కాపీ కొడతాడని భావించారు అప్పట్లోనే ఒకవేళ బాబు ఫించన్ రెండువేలు చేస్తే తాను మూడు వేలు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు బాబు రెండు వేలు ఫించన్ అనగానే జగన్ మూడు వేలు ఇస్తానని ప్రకటించారు కూడా. బాబు పథకాలకు ధీటుగా బదులు ఇవ్వటానికి వైసీసీ కూడా సిద్దం అయినట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే మరికొన్ని రోజుల్లో రెండు పార్టీలు ప్రజలకు మరిన్ని వరాల జల్లులు కురిపించే అవకాశం లేకపోలేదు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి