వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు బి.సి మహా సభలో ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన బి.సి డిక్లరేషన్ దేశ రాజకీయాల్లోనే ఒక చారిత్రాత్మక ప్రకటనగా నిలవనుంది. విశ్వసనీయతకు మారుపేరుగా భావించే వై.ఎస్ కుటుంబానికి చెందిన జగన్ వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చి, బి.సి డిక్లరేషన్ అమలు చేస్తే నిజంగానే అది దేశ రాజకీయాల్లో పెను సంచలనం కానుంది.
ఎందుకంటే ఆయన చెప్పిన ప్రకారం ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం బి.సి, ఎస్.సి, ఎస్.టి, మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తే ఇప్పటివరకు రెండు, మూడు కులాలకే దక్కుతున్న నామినేటెడ్ పదవుల్లో మెజారిటీ వాటాను వెనుకబడిన వర్గాల వారు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బి.సి లు ఎదగాలంటే ప్రధానంగా రాజకీయ అధికారంతో పాటు ఆర్ధిక అవకాశాలు కూడా ముఖ్యం. జగన్ నామినేటేడ్ పదవులతో పాటు ప్రభుత్వ నామినేషన్ కాంట్రాక్టు పనుల్లో కూడా 50 శాతం బి.సి, ఎస్.సి, ఎస్.టి, మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పడం చారిత్రాత్మక నిర్ణయమే కాదు.... సాహసోపేతమైన నిర్ణయం. బి.సి డిక్లరేషన్ లో ప్రకటించిన మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ఈ రెండు నిర్ణయాలు అమలుచేస్తే చాలు... రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమ్ ఖాయం.
ఇక 45-60 ఏళ్ల మధ్య ఉన్న బి.సి మహిళలకు నేరుగా 75 వేల రూపాయలు ఉచితంగా అందచేస్తానని ప్రకటించడం హర్షణీయం. బి.సి ల్లో ఉన్న 139 కులాలకు 139 కార్పొరేషన్లు వేసి పారదర్శకంగా వారి డిమాండ్లను కూలంకషంగా చర్చిస్తామని చెప్పారు. సమగ్ర బి.సి సబ్ ప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకువస్తామని ప్రకటించారు. బి.సి ల సంక్షేమం కోసం ప్రతి ఏటా 1500 కోట్లు ఖర్చు పెడతామన్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతి 10 వేలు ఇస్తామనడం, కుల వృత్తి చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు ఏడాదికి 10 వేలు, రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వారికి జీరో వడ్డీపై 10 వేలు ఇస్తామని ప్రకటించడం స్వాగతనీయం.
బి.సి వర్గాల్లోకి తీసుకువెళ్లాలి
దాదాపు ఏడాదికి పైగా వై.ఎస్.ఆర్.సి.పీ బి.సి విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి బి.సి లోని 139 కుల సంఘాల నాయకులతో విడివిడిగా సమావేశమై ఆయా సంఘాల నాయకుల నుంచి వచ్చిన డిమాండ్లను సమగ్రంగా అధ్యయనం చేసి తమ అధినేతకు సమగ్ర నివేదిక అందజేశారు. ఆ మేరకు వై.ఎస్.జగన్ దానిని నిశితంగా పరిశీలించి, సహచరులతో సంప్రదింపులు జరిపి ఎట్టకేలకు ఈ చారిత్రాత్మక బి.సి.డిక్లరేషన్ ను ప్రకటించారు. అధినేత జగన్ తనకు అప్పగించిన పనిని జంగా సమర్ధవంతంగా నిర్వహించారు. జగన్ బి.సి లకు అద్భుతమైన నిర్ణయాలను ప్రకటించారు. ఇక మిగిలిన పని చేయాలసింది పార్టీ క్యాడర్. బి.సి. ల నుదిటి రాతను మార్చే వై.ఎస్.ఆర్.సి.పీ ప్రకటించిన ఈ డిక్లరేషన్ వివరాలను బి.సి ఓటర్లందరికి చేరవేయాలిసిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలదే... ఆ పని వారు సక్రమంగా చేయగలిగితే వచ్చే ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సి.పీ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి