గతంలో అంటే... 30, 35 ఏళ్ల కిందట పీపుల్స్ వార్ ప్రభావం బాగా ఉన్న ప్రాంతాల్లో తెల్లగా సున్నం వేసిన గోడలపై ఎర్రటి అక్షరాలతో ఇలా రాసి ఉండేది... అయ్యలారా...అమ్మలారా... ఓట్లు మీరు వేయకండి... బూటకపు ఎన్నికలను బహిష్కరించండి.... అని రాసి ఉండేది. ఆ రాతలు చదివి ఆ తరంలో యువతీ యువకులు చాలామంది అడవి బాట పట్టారు. వారికి ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండేది కాదు ... సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం వస్తుందనేది వారి ప్రగాఢ విశ్వాసం.
ఎన్ టీ ఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో నక్సలైట్లు దేశ భక్తులు అన్నాడు... కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వచ్చిన ఆ పార్టీ కి అఖిలాంధ్ర ప్రజలు, కమ్యూనిస్టులతో పాటు... బుల్లెట్ ను కాకుండా బ్యాలెట్ ను నమ్ముకున్న ఎం.ఎల్ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి.
ఇప్పుడు గౌరవనీయులైన మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయింది. ఆయన వ్యాఖ్యలు దీనిని స్పష్టం చేస్తున్నాయి.
" ప్రజాస్వామ్యం భవిష్యత్తును ఒక యంత్రం మీద వదిలిపెట్టారు. ఈవీఎం లను టాంపరింగ్ చేశారు. ఈవీఎం లలో చిప్ లు మార్చేశారు. ఎన్నికల సంఘాన్ని బి.జె.పీ బ్రాంచ్ ఆఫీస్ గా మార్చేశారు." ఈ వాఖ్యలు చూస్తే చంద్రబాబుకు ఎన్నికల వ్యవస్థపై పూర్తిగా నమ్మకం పోయినట్టు ఉంది. మంత్రులు, ఎం.పీ లతో ఢిల్లీ వెళ్తానంటున్నారు... వెళ్లి ఏమి చేస్తారు... ఎన్నికల సంఘాన్ని కలుస్తానంటున్నారు... అవసరమైతే ధర్నా చేస్తానంటున్నారు... అసలు ఈయన ఆరోపణలు చేసేదే ఎన్నికల సంఘం మీద... ఇంకా ఎన్నికల సంఘం కు మొర పెట్టుకుంటే ప్రయోజనం ఏమి . కేవలం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రెస్ లో పబ్లిసిటీ తప్ప.. బహుశా చంద్రబాబుకు కావలసింది కూడా అదే... లేదా నిజంగా చిత్తశుద్ధితో ఆయన పోరాటం చేస్తే... మావోయిస్టుల్లో కలసిపోవలసిందే...
పైగా ఆయన అంటారూ. ఈవీఎం ల కంటే బాలెట్ పేపర్ లే బెటర్ అట... అవైతే ఎంచక్కా మన చేత్తో ముద్ర వేసి ... చక్కగా మడత పెట్టి బాక్స్ లో వేయొచ్చట... అనుమానం వస్తే రీ కౌంటింగ్ చేసుకోవచ్చంట... ఈవీఎం లు అయితే ఆలా కుదరదంట.. అందుకే మళ్ళీ పాత విధానం రావాలంట.. ఇది పురోగమనమా.. తిరోగమనమా...
కాకపొతే... అన్ని విషయాల్లో ప్రపంచంలో వచ్చే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే చంద్రబాబు ఇలా మాట్లాడడమే విచిత్రం...
గతంలో ఇందిరా గాంధీ దేశంలో కుటుంబ నియంత్రణ పెట్టినపుడు ఎన్టీఆర్ దానికి వ్యతిరేకంగా తాతమ్మ కల అని ఒక సినిమా తీశాడు. కుటుంబ నియంత్రణ తప్పు.. ఆలా చేసి ఉంటే... మన దేశంలో ఒక గాంధీ పుట్టేవాడు కాదు.. ఒక రవీంద్రనాధ్ టాగోర్ పుట్టేవాడు కాదు అని...ఆయన వాదించారు. (వాళ్లిద్దరూ వాళ్ళ తల్లిదండ్రులకు ఏడో సంతానంగానో... ఎనిమిదో సంతానంగానో పుట్టారట...)
వృద్ధాప్యంలో ఎందుకీ కష్టాలు...
చంద్రబాబు మరో వారం రోజుల్లో అంటే ఈ నెల 20 వ తేదీన 70 వ ఏట అడుగుపెడుతున్నారు. హాయిగా కృష్ణా...రామా... అనుకుంటూ... మనవడు దేవాన్ష్ తో ఆడుకోక ఆయనకు ఎందుకీ కష్టాలు. చేసి ఘనకార్యం చాలు... ఇంతటి తో తృప్తి పడి శేష జీవితం ప్రశాంతంగా బతికేయక ఎందుకీ జంఝాటాలు...ధర్నాలు... పోరాటాలు... రేపు మోడీ కక్ష గట్టి కేసులు పెట్టి జైలు పాలు చేస్తే... పడరాని కష్టాలు పడాల్సొస్తుంది...బాబు గారు... నా మాట వినండి... గమ్మున ఉండండి...
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి