మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దేశానికి నేను చౌకీదార్ గా వ్యవహరిస్తున్నానని చెప్పుకుంటున్నారు. మరి ఆయన హయాంలోనే నీరవ్ మోదీ, విజయ మాల్యా లాంటి ఎందరో బడా పారిశ్రామికవేత్తలు వేళా, లక్షల కోట్లు మింగేసి, దేశం వదిలి పరారయితే... ఈ చౌకీదార్ ఏం చేస్తున్నాడని ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. చౌకీదార్ ఎవరికీ కాపలా కాశాడు. అవినీతి పరులకు, అక్రమార్కులకు చౌకీదార్ గా వ్యవహరించాడా... అని ప్రశ్నిస్తున్నారు. పైగా అనిల్ అంబానీ, అదానీ వంటి బడా పారిశ్రామిక వేత్తలకు దేశ సంపదను దోచిపెట్టారని ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వారణాసి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న నరేంద్ర మోదీ మీద పోటీకి సమాజ్ వాదీ పార్టీ తరపున అసలు సిసలైన చౌకీదార్ ను పోటీకి నిలబెట్టారు. అతని పేరు తేజ్ బహదూర్ యాదవ్. హర్యానా రాష్ట్రం లోని రేవన్ ప్రాంతానికి చెందిన తేజ్ బహదూర్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో కానిస్టేబుల్. హిమాలయాల్లో దేశ సరిహద్దుల్లో ఎల్.ఓ.సి లో అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం ప్రాణాలొడ్డి పని చేసే మన సైనికులకు కేంద్ర ప్రభుత్వం నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తోందంటూ తేజ్ బహదూర్ ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. అది ఆతను చేసిన తీవ్రమైన తప్పుగా భావించి మిలిటరీ అధికారులు అతనిపై క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో తేజ్ బహదూర్ వారణాసి లోక్ సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి ఈ దేశానికి ఎవరు నిజమైన చౌకీదారో ప్రజలే నిర్ణయిస్తారంటూ ప్రధాని మోదీ కి సవాల్ విసిరాడు.
అందిపుచ్చుకున్న అఖిలేష్ యాదవ్
వచ్చిన అవకాశాన్ని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అందిపుచ్చుకున్నారు. వాస్తవానికి అక్కడ ఎస్.పీ, బి.ఎస్.పీ ల ఒప్పందంలో భాగంగా ఈ స్థానం ఎస్.పీ కి కేటాయించారు. ఎస్.పీ తరపున తొలుత షాలిని యాదవ్ ను తమ అభ్యర్థిగా ప్రకటించారు. ఈమె రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ శ్యామ్ యాదవ్ కోడలు. అయితే సైనికులకు నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తున్నారంటూ వీడియో బయట పెట్టి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తేజ్ బహదూర్ యాదవ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుండడం, పైగా అతను, ఎస్.పీ అభ్యర్థి షాలిని యాదవ్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ప్రతిపక్షాల ప్రధాన టార్గెట్ అయిన ప్రధానికి వ్యతిరేకంగా ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో అఖిలేష్ యాదవ్ రాజకీయ విజ్ఞత ప్రదర్శించారు. తమ పార్టీ అభ్యర్థిని మార్చి, ఇండిపెండెంట్ గా వేసిన తేజ్ బహదూర్ నే తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక ఎన్నికల్లో ఎవరు నిజమైన చౌకీదారో ప్రజలే నిర్ణయించాల్సి ఉంది.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి