Translate

  • Latest News

    1, మే 2019, బుధవారం

    శ్రీలంక దాడుల సాకుతో...

    భార‌త దేశం లౌకిక దేశం. అన్ని మ‌తాలు, కులాలు, వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ‌కు ఇష్ట‌మైన ఆచారాన్ని, సంప్ర‌దాయాన్ని, మ‌తాన్ని ఎంచుకొని ఆచ‌రించ‌వ‌చ్చు. ఈ దేశంలో ఏ మ‌తం దేశ అధికార మ‌తం కాదు. గ‌త కొంత కాలంగా దేశ‌భ‌క్తికి తామే పేటెంట్ హ‌క్కుదారులుగా భావిస్తున్న బీజేపీ, శివ‌సేన‌,విశ్వ‌హిందు ప‌రిష‌త్ లాంటి పార్టీలు మైనార్టీ ప్ర‌జ‌ల సాంప్ర‌దాయాల‌పై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ దేశంలో ఉండాలంటే త‌ప్ప‌ని స‌రిగా తాము చెప్పిన విధానాన్ని పాటించాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి. గోసంర‌క్ష‌ణ పేరుతో ముస్లిం మైనార్టీ, ఎస్సీల‌పై భార‌త దేశంలో ఎంతటి అరాచ‌క‌త్వం సృష్టించారో అంద‌రికి తెలిసిందే. ముస్లిం వివాహ వ్య‌వ‌స్థ‌పై, వారి ఆచారాలు, సంప్ర‌దాయాల‌పై అన‌ధికార ఆజ్ఞలు అమ‌లౌతున్నాయి. తాజాగా శ్రీ‌లంక‌లో దాడుల అనంత‌రం దేశంలో  ముస్లిం మ‌హిళ‌లు ధ‌రించే బుర‌ఖాపై కూడా హిందుత్వ శ‌క్తులు నిషేధం  విధించాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాయి. 
    శ్రీలంకలో బాంబు దాడుల నేపథ్యంలో... 

    బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ముసుగు ధరించడాన్ని శ్రీలంక ప్రభుత్వం నిషేధించింది. శ్రీలంకలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కార్యాలయం వెల్లడించింది. తాజా నిబంధనలు సోమవారం నుండి అమల్లోకి వచ్చాయి. వ్యక్తి గుర్తింపును మరుగుపరిచేలా ధరించే ఎలాంటి ముసుగు లేదా వస్త్రాన్ని ముఖంపై ధరించరాదని శ్రీలంక అధ్యక్ష కార్యాలయం స్పష్టం చేసింది.ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నవారు, ప్రజల రక్షణకు ఇది చాలా కీలకమని, శ్రీలంకలో మైనారిటీ మతస్థులు కూడా ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. ఈ ప్ర‌క‌ట‌న తో   మ‌న‌దేశంలోని హిందుత్వ‌వాదుల‌కు ఒక సాకు దొరికిన‌ట్లైంది.
    మతాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం... 
         బుర‌ఖా ధ‌రించ‌టం మంచిదా లేదా చెడ్డ‌దా అన్న‌ది ఆయా మ‌తాల‌కు చెందిన వారు నిర్ణ‌యించుకోవాలి. ఈ విష‌యంపై ముస్లింల ప‌విత్ర గ్రంధం   ఖురాన్‌లో....  ప్రవక్తా నీ భార్యలకూ కుమార్తెలకూ ఇతర ముస్లిం మహిళలకూ వారు తమ పైటలను తమ ముఖాలపై కప్పుకోవాలని చెప్పు.ఇదే సరైన పద్ధతి.దీనివల్ల ఎవరైనా గుర్తించి వేధిస్తారనే భయం ఉండదు.. (ఖురాన్ 33:59.), ఇతరులముందు స్త్రీలు తమ అందచందాలను అలంకరణలను బహిర్గతం చేయకూడదు. (ఖురాన్ 24:31)....  అని స్ప‌ష్టం చేసి ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ అంశంపై ఆ మ‌తస్తులు నిర్ణ‌యం తీసుకోవ‌ల్సి ఉంటుంది. కాని మైనార్టీ మ‌తాల‌కు చెందిన ప్ర‌తి ఆచారంలోనూ వేలు పెడుతూ  ఇది అనుస‌రించ‌ని వారిపై దాడులు చేస్తూ బీభత్సాన్ని సృష్టిస్తున్న వారు తాజాగా బురఖాపై అగ్గి రాజేయ‌టానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.
    హిందువుల  ఓట్ల కోసమే... 
    ఇలా ప్ర‌వ‌ర్తించేవారికి స్ప‌ష్ట‌మైన ఎజెండా ఉంది. మైనార్టీ,ఎస్సీ,ఎస్టీలు,బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు చెందిన వారిని త‌మ చెప్పుచేతుల్లో ఉంచుకోవ‌ట‌మే. దీంతో పాటు హిందుత్వ ఎజెండాను అమ‌లు చేయ‌టం, దీన్ని రాజ‌కీయంగా  వాడుకొని హిందువుల‌ ఓట్లు కొల్ల‌గొట్టడ‌మే. ఇప్ప‌టికే భిన్న‌స్వ‌రాలు వినిపించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడితే దేశ‌ద్రోహి ముద్ర‌వేసి జైళ్ల‌లో కుక్కేస్తున్నారు. మ‌నం ఏమి తినాలో, ఎలా మెల‌గాలో, ఏం  చ‌ద‌వాలో నిర్ధేశిస్తున్న హిందుత్వ‌వాదుల  చ‌ర్య‌ల‌ను ఆదిలోనే ప్ర‌తిఘ‌టించ‌క‌పోతే భ‌విష్య‌త్తులో పెను ప్ర‌మాదం పొంచి ఉంది త‌స్మాత్ జాగ్ర‌త్త‌....




    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: శ్రీలంక దాడుల సాకుతో... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top