కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి దేశంలో లాక్ డౌన్ ప్రకటించి చాలావరకు కట్టడి చేయగలిగాము. ప్రపంచంలో అగ్ర రాజ్యాలన్నీ కరోనా కోరల్లో చిక్కి విలవిలలాడుతుంటే... మన దేశంలో మాత్రం కరోనా అదుపులోనే ఉంది. దేశంలో రోజూ వస్తున్న కేసులన్నీ కేవలం కొన్ని రెడ్ జోన్ల లోనే వస్తున్నాయి. దేశంలో మూడొంతుల ప్రాంతం సేఫ్ జోన్ గానే ఉంది. సరైన సమయంలో లాక్ డౌన్ చేయడం వల్లే మనం కరోనాను అదుపు చేయగలిగాము. అయితే... కేంద్ర ప్రభుత్వం రేపటినుంచి(మే 12) దేశంలో ప్రధాన నగరాల మధ్య రైళ్లు నడపాలని తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా ఆందోళనను రేకెత్తిస్తోంది. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న దాని ప్రకారం మే నెల చాలా కీలకం. మన దేశంలో ఇప్పటికీ ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు లో కరోనా ఉధృతంగా ఉంది. ఈ దశలో ఢిల్లీ నుంచి దేశంలో వివిధ రాష్ట్రాలకు రైళ్ల రాకపోకలు ప్రారంభిస్తే.. ఏ వైపరీత్యం ముంచుకొస్తుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఒక వేళ లాక్ డౌన్ ఈ నెల చివరి వరకు పొడిగించినప్పటికీ, ఈ నెల 17 తర్వాత గ్రీన్, ఆరంజ్ జోన్లలో దాదాపుగా లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసే అవకాశం ఉంది. అదే జరిగితే... ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చెప్పినప్పటికీ ప్రజలు వాటిని అంత కచ్చితంగా ఆచరిస్తారనేది ఒట్టి మాట. ఈ నేపథ్యంలో కరోనా విజృంభించే ప్రమాదం ఉంది. అదే జరిగితే... ఈ యాభయి రోజుల పాటు దేశం యావత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాటను శిరసావహిస్తూ పాటించిన లాక్ డౌన్ మొత్తం బూడిద లో పోసిన పన్నీరే కానుందా... కూ....చుక్...చుక్..చుక్ అంటూ రైళ్లు పరిగెడితే దాంతో పాటు దేశంలో కరోనా కూడా పరిగెడితే... ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేయగలవా... ఇటలీ, అమెరికా లోలా చేయి దాటిపోతే... ప్రభుత్వాలు చేతులెత్తేసే పరిస్థితి వస్తే... ఆమ్మో... తలచుకుంటేనే భయం వేస్తోంది... ఆలా జరగకుండా ఉండాలని కోరుకుందాం... లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినా ప్రతి ఒక్కరూ ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిద్దాం... కరోనా కాటుకు అవకాశం ఇవ్వకుండా చేద్దాం...
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి