ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం బహు పసందుగా సాగుతోంది. రాజకీయ చదరంగంలో ప్రత్యర్ధులు ఒకరిని మించి ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఆటను మహా రంజుగా నడిపిస్తున్నారు... 2019 ఎన్నికలు ముగిసి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఎన్నికయినప్పటి నుంచి రాష్ట్రంలో ఈ చదరంగం ఆట రాష్ట్ర రాజకీయ యవనికపై నిరాటంకంగా... అప్రతిహాతంగా... అనూహ్యమైన ట్విస్ట్ లతో ఆసక్తికరంగా ప్రదర్శితమవుతోంది. 42 ఏళ్ల రాజకీయ అనుభవంతో పాటు అపర చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబుతో 47 ఏళ్ల వయసున్న యువ ముఖ్యమంత్రి ఆడుతున్న రాజకీయ క్రీడ అనుక్షణం ఉత్సుకత రేకెత్తిస్తోంది. గత ఏడాది కాలంగా జగన్ ను దెబ్బ తీయడానికి చంద్రబాబు వేస్తున్న ఒక్కో ఎత్తుగడకు ఆ క్షణంలో జగన్ చిత్తయి పోయినట్టు అనిపించినా..వెంటనే జగన్ దానికి పై ఎత్తు వేసి ఆ ఉపద్రవం నుంచి బయట పడుతున్నాడు... జగన్ తాత్కాలికంగా కాస్త తగ్గినట్టు కనిపించాడంటే... సైలెంట్ గా ఉన్నాడంటే ఏదో పెద్ద ఎత్తుగడ వేస్తున్నాడన్న మాట..(సింహం వేటాడే ముందు ఒక్క అడుగు వెనక్కి వేసినట్టు) రాష్ట్రంలో ఏడాది కిందట అధికారంలోకి వచ్చిన జగన్ కు తొలి రోజుల్లో ఇసుక సమస్య బాగా ఇబ్బంది పెట్టింది. ఇసుక పాలసి పెట్టి... నిదానంగా ఆ సమస్య నుంచి బయట పడ్డారు... ఈ లోగా చంద్రబాబు అండ్ కో ను చావు దెబ్బ తీయడానికి మూడు రాజధానుల అంశాన్ని ముందుకు తెచ్చారు.. అమరావతిని లెజిస్లేటివ్ రాజధానిగా పరిమితం చేసి కార్యనిర్వాహక రాజధానిగా వైజాగ్ ను పెట్టనున్నట్టు ప్రకటించడంతో చంద్రబాబుకు మతి పోయింది. ఊహించని ఈ పరిణామంతో ఖిన్నుడైన చంద్రబాబు తనకు అలవాటైన అస్త్రం కోర్టు ద్వారా దీనిని తాత్కాలికంగా అడ్డుకున్నారు. దీనికి పై ఎత్తుగా జగన్ శాసనమండలి ని రద్దు చేయడానికి యత్నిస్తే... ఆ ప్రయత్నాన్ని కూడా చంద్రబాబు కోర్టు ద్వారా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం అంశం, పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వై.సి.పీ రంగులు... ఈ అంశాలన్నిటిలో జగన్ కు ఎదురు దెబ్బ తగిలింది. కోర్ట్ ద్వారా వాటికి బ్రేక్ పడింది.
ఈ తరుణంలో కోవిడ్ -19 వచ్చి పడింది. ప్రతిపక్షం యధావిధిగా పాలక పక్షం కరోనా ను ఎదుర్కోవడంలో విఫలం అయిందని మీడియాలో ఊదరగొట్టడం మొదలెట్టింది. జగన్ అవేమీ పట్టించుకోకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోయాడు. దేశంలోనే అత్యధికంగా కోవిద్ టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని జాతీయ మీడీయా కూడా చెప్పడంతో ప్రతిపక్షం నోళ్లు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో ఊహించని విధంగా మే 7 వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో వైజాగ్ లో ఎల్.జి పాలిమర్స్ అనే కంపెనీ నుంచి విష వాయువు వెలువడి 12 మంది చనిపోవడం... వేలాది మంది అస్వస్థతతో ఆస్పత్రి పాలవడం జరిగింది. దీనిపై వెంటనే వైజాగ్ వెళ్లి ప్రభుత్వాన్ని అల్లరి చేద్దామని చంద్రబాబు వైజాగ్ పర్యటనకు తనకు స్పెషల్ ఫ్లైట్ కు అనుమతి ఇవ్వమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాడు. అయితే పాపం అనుమతి లభించ లేదు. అయినా భావి రాజధానిగా భావిస్తున్న వైజాగ్ లో ఈ పెను ప్రమాదం జరిగింది కాబట్టి... ఇది జగన్ కు పెద్ద దెబ్బ అని, వైజాగ్ లో రాజధాని పెట్టడం జరగదని చాలా మంది రాజకీయ పరిశీలకులు భావించారు. అయితే ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో బాబును మించిన జగన్ అనుకోని ఈ ఉపద్రవాన్ని సమర్ధంగా ఎదుర్కొన్నాడు... వైజాగ్ ఘటనలో మృతులకు ప్రతిపక్షాలు కనీసం కలలో కూడా ఊహించని నష్ట పరిహారం కోటి రూపాయలు ప్రకటించేసరికి అటు ప్రతి పక్షాలకు గాని, ఇటు ప్రజా సంఘాలు కానీ, స్థానిక ప్రజలు కానీ... ఎవరికీ వాయిస్ లేకుండా పోయింది.
జగన్ జగమొండి అనుకోండి... ఏమైనా అనుకోండి... ఆయన ఒకటి అనుకుంటే ఆ పని చేసేదాకా నిద్రపోడు. ఆ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే... ఇప్పుడు వైజాగ్ రాజధాని విషయంలోనూ అంతే... ఆరు నూరు అయినా... నూరు ఆరు అయినా వైజాగ్ లో రాజధాని ఖాయం... అందుకే అక్కడి ప్రజల కోసం వంద కోట్లు అయినా... వెయ్యి కోట్లు అయినా వెనుకాడడు... అక్కడి ప్రజల మనసులు గెలుచుకోవడానికి ఏమైనా చేస్తాడు... ప్రజల మనసులో కాదు నిన్నటి ఉదంతంతో వైజాగ్ లో తెలుగుదేశం ఎం.ఎల్.ఏ గణబాబు మనసు కూడా గెలిచేశాడు. దటీజ్ జగన్...
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి