శూన్యం నుంచే ఈ అనంత విశ్వం ఆవిర్భవించింది. కొత్త సృష్టికి గాఢ మైన శూన్యం అవసరం... 1982 లో రాష్ట్రంలో అలాంటి రాజకీయ శూన్యం లో నుంచే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి అఖండ విజయం సాధించింది. మళ్ళీ అలాంటి శూన్యం 2014 లో ఏర్పడింది...కాంగ్రెస్ నిర్వీర్యమై ఆ స్థానాన్ని వై.ఎస్.ఆర్ సీపీ ఆక్రమించుకుని విజయం అంచుల వరకు వచ్చింది కానీ... విజయ శిఖరాన్ని అందుకోలేకపోయింది. ఎందుకంటే అప్పట్లో ప్రతి పక్షాలన్నింటిని ఏకం చేసి చంద్రబాబునాయుడు చావోరేవో అన్నట్లు పోరాడారు. 2019లో అదే శూన్యత లో నుంచి వైఎస్సార్ సీపీ ఘనవిజయం సాధించింది. టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమై అందులోనూ ఎవరు పార్టీలో ఉన్నారో లేరో తెలియని సందిగ్దంలో కొట్టుమిట్టాడుతుంది. వెంటిలేటర్పై ఉన్న ఆ పార్టీ ని పూర్తిగా నిర్జీవం చేసేందుకు ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంబించింది.
వీర్రాజుకు వీర తాడు ఎందుకు వేశారంటే...
ప్రస్తుతం ఏపీలో వైఎస్సార్ సీపీ బలంగా ఉంది. ఆ పార్టీని టచ్ చేయటం కష్టం. మిగిలింది. టీడీపీ మాత్రమే. ఈ పార్టీతో గతంలో పనిచేసి, బోలెడంత అనుభవం మూటగట్టుకుంది. ఈ క్రమంలో కలసి ప్రయాణించే విషయం కుదరని పని. ఇప్పటికే జనసేన పార్టీ బీజేపీతో కలిసి సాగుతోంది. ఇక మిగిలింది టీడీపీ. ప్రస్తుతం ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరిపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నాయకుల్లో మెజారిటీ లీడర్లను బీ.జె.పీ లో చేర్చుకుని...తద్వారా ఏపీ లో ఆ పార్టీని నిర్వీర్యం చేయడం ద్వారా ఏర్పడే శూన్యత లో బీజేపీ చొచ్చుకుపోవాలని పధకం. ఇది జరగాలంటే రాష్ట్రంలో బి.జె.పీ అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి టీడీపీకి తోకాడించే వ్యక్తి అయితే కుదరదు. టీడీపీతో ఢీకొట్టే వ్యక్తి అయితేనే సాధ్యం. అందుకే కన్నాను పక్కన పెట్టి వీర్రాజుకు వీర తాడు వేశారు.
బీజేపీ తప్ప వేరే గత్యంతరం లేదు
బీజేపీ తప్ప వేరే గత్యంతరం లేదు
మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్ దూకుడుగా ముందుకు వెళుతున్నారు. టీడీపీ హయాంలో చేసిన తప్పులు వెతికి సీనియర్ నేతలు అనుకున్నవారిని జైలుకు పంపుతున్నారు. అచ్చెన్నాయుడు ఉదంతం చూసాక ఎప్పుడు ఎవరి వంతు వస్తుందోనని టీడీపీ నేతలంతా హడలి పోతున్నారు. కేసులు ఒకవైపు మెడపై కత్తుల్లా వేలాడుతుంటే... ఈ సమయంలో తమను తాము కాపాడుకోవటానికి బీజేపీ తప్ప వారికి మరో మార్గం లేదు. సో... బీజేపీ కి ఏపీ లో ప్రతిపక్ష స్థానములోకి చొరబడటానికి ఇదే సరైన సమయం. టీడీపీని నిర్వీర్యం చేయడమే వారి ప్రధమ కర్తవ్యం.. ఆ దిశగా బీజేపీ అధినాయకత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది...దానిని బీజేపీ భర్తీ చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడమే ఇందుకు తార్కాణం.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి